హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగను సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సారథ్యంలో రూపొందించిన బతుకమ్మల పాటలను మంత్రి శ్రీనివాస్గౌడ్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పండుగని అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర పండుగగా గుర్తించి ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 6 నుంచి 13వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు మహిళలు, ప్రభుత్వ మహిళా ఉద్యోగులు వేడుకలను కార్యాలయాల్లో నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు.
ఉద్యమ సమమయంలో బతుకమ్మ సంబురాలు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయన్నారు. జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో బతుకమ్మ వేడుకలు విశ్వవ్యాప్తమయ్యాయని కొనియాడారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లో అధికారికంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు, టీజీఓ కేంద్ర సంఘం అధ్యక్షురాలు మమత, పర్యాటక, సాంస్కృతిక శాఖ జాయింట్ సెక్రెటరీ రమేశ్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, పలువురు నటీనటులు పాల్గొన్నారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ పాటకు ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించగా.. శృతి, వీణా, సితార నవీణ్, నాగదుర్గ ఆడిపాడారు.