రవీంద్రభారతి, మార్చి 24 : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నదని, రెండు రోజుల్లో రూ.8,500 కోట్ల చెల్లించకపోతే ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా తరగతుల బహిష్కరణ, కలెక్టరేట్లను ముట్టడిస్తామని బీసీ జాక్ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య అల్టిమేటం జారీ చేశారు. ఫీజు బకాయిలు చెల్లించాలని విద్యార్థులు ఇప్పటివరకు శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్నా ప్రభు త్వం పట్టించుకోవడం లేదని, ఇకనుంచి రాజకీయ నాయకుల అవినీతి వ్యతిరేక పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో బీసీ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్గౌడ్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన బీసీ విద్యార్థుల సమ్మేళనానికి శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారితో కలిసి ఆయన హాజరయ్యారు.
ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ను ఎత్తేసేందుకు సీఎం రేవంత్ కుట్రచేస్తున్నారని ధ్వజమెత్తారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఒక మోసమని, బీసీలకు ఏటా రూ.20 కేటాయిస్తామని కేవలం 12వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకొన్నారని నిప్పులు చెరిగారు. సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న సీఎం నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో బీసీ జాతీ య సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్, అఖిలభారత యాదవ సంఘం జాతీయ అధ్యక్షుడు రాములుయాదవ్, మల్లేశ్యాదవ్, జిల్లపల్లి అంజి, విద్యార్థి సంఘం నేత రామ్దేవ్ మోదీ పాల్గొన్నారు.