హైదరాబాద్ : కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అటవీ పర్యావరణ, కార్మిక శాఖల మంత్రి భూపేంద్ర యాదవ్ లను రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి బుధవారం ఢిల్లీలో కలిశారు. కార్మిక మంత్రిత్వ శాఖకు స్కిల్ డెవలప్ మెంట్ కింద కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు విజ్ఞప్తి చేశారు.
అలాగే నాచారంలో ఉన్న 350 బెడ్ల ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు, సహకారం అందించాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ను కోరారు.
కరోనా సమయంలో 17 లక్షల మంది ఈఎస్ఐ లబ్ధిదారులకు ఇబ్బంది కలిగింది. కార్మిక శాఖ పరిధిలో ఉన్న సనత్ నగర్ హాస్పిటల్ ను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది ఈఎస్ఐ కార్పొరేషన్ కు అప్పగించారు. దానికి ప్రతిగా నాచారం హాస్పటల్ ఇచ్చారని భూపేంద్ర యాదవ్ కు తెలిపారు.
ఈ హాస్పటల్ కు అనుబంధంగా ఏర్పాటు చేయదలచిన ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి నిధులు, సహకారం అందించాలని కోరారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.140 కోట్ల పెండింగు నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కొత్తగా 33 జిల్లాలు ఏర్పడడంతో పాటు, కొత్త పరిశ్రమలు, కార్మికుల సంఖ్య పెరుగుతున్నందున వాటికి అనుబంధంగా కొత్త ఈఎస్ఐ హాస్పిటల్స్ మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు.