Property Registrations| హైదరాబాద్, జూన్ 30(నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజులుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా స్తంభించింది. సర్వర్ పని చేయకపోవడంతో వెబ్సైట్ ఓపెన్ కాక ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకొన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల 26 నుంచి 28వ వరకు 3 రోజులపాటు సర్వర్ అప్డేట్ కోసం రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. ఆ మూడు రోజులు వెబ్సైట్ ఓపెన్ కాలేదు. ప్రభుత్వం చెప్పిన గడువు పూర్తికావడంతో కొందరు సోమ, మంగళవారం రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని నిర్ణయించారు. అయితే ఈ రెండు రోజులు కూడా వెబ్సైట్ పని చేయకపోవడంతో కార్యాలయాలకు వచ్చి వెనుదిరిగారు.
ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న రియల్ రంగంపై రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్ సమస్య మరింత ప్రభావం చూపుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఐదారుసార్లు రిజిస్ట్రేషన్ల వెబ్సైట్ పని చేయలేదు. పనివేళల్లో కూడా అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఎస్ఆర్వోలు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పుడు సర్వర్ను అప్డేట్ చేస్తున్నామంటూ మూడు రోజులపాటు రిజిస్ట్రేషన్లను బంద్ చేసినా ఫలితం మాత్రం మారలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సర్కారు చెప్పిన మూడు రోజులకు అదనంగా రెండు రోజులు గడిచినా సమస్య కొలిక్కిరాకపోవడంతో రిజిస్ట్రేషన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రజలు, డాక్యుమెంట్ రైటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం దివాళా తిసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంతో పోల్చితే భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు పడిపోయాయని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు భూముల మార్కెట్ విలువలను ప్రభుత్వం భారీగా పెంచింది. దీంతో అప్పటి వరకు కొద్దిగా ఉన్న బేరాలు భూముల ధరల పెంపుతో మరింత దివాళా తీసిందనే విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో రోజూ 30 వరకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యేవని, ప్రస్తుతం రోజుకు ఏడు నుంచి పదిలోపే అవుతున్నట్టు సిబ్బంది చెబుతున్నారు. ఒక్కో రోజు రెండు, మూడు డాక్యుమెంట్లు అయిన సందర్భాలు కూడా ఉన్నాయని ఓఎస్ఆర్వో చెప్పడం గమనార్హం.