BRS | హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మాడల్ మహారాష్ట్రలో ఊరూరా మార్మోగుతున్నది. ఆ రాష్ట్రంలో స్థానిక కళాకారులు ఇల్లిల్లూ తిరిగి తెలంగాణ మాడల్పై మరాఠీ భాషలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ మాడల్కు, ప్రధాని నరేంద్రమోదీ మాడల్కు మధ్య ఉన్న తేడాలను, వాస్తవాలను కళారూపాల ద్వారా అందరి కండ్లకు కడుతున్నారు. ప్రధానిగా మోదీ దేశానికి ఏమీ చేయలేదన్న వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణ ఆవశ్యకతను చాటిచెప్తున్నారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాద నేపథ్యాన్ని విపులంగా వివరిస్తున్నారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుతోపాటు గ్రామస్థాయి పార్టీ కమిటీలను, పార్టీ అనుబంధ కమిటీలను నియమిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఒకొక్కరికి రూ.15 లక్షలు ఇస్తామని చెప్పి..
‘అందరూ బ్యాంకు ఖాతాలు తెరిస్తే రూ.15 లక్షల చొప్పున ఇస్తామని నమ్మబలికి ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన మోదీ.. ఇప్పటికి 9 ఏండ్లు అవుతున్నా ఎవరికీ నయాపైసా ఇవ్వలేదు. పైపెచ్చు వ్యవసాయాన్ని నీరుగార్చేందుకు 3 నల్ల చట్టాలను తెచ్చారు. కానీ, తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రైతుబంధు పథకాన్ని తెచ్చారు. రైతుబంధు పేరిట ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇస్తున్నారు.
వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలూ నాణ్యమైన విద్యుత్తును అందజేస్తున్నారు. మరణించిన రైతు కుటుంబాలు రోడ్డున పడకుండా రూ.5 లక్షల రైతుబీమా ఇస్తున్నారు. దేశంలో రైతును ఆదుకున్న కేసీఆరే స్వయంగా ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అన్న నినాదాన్ని ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి.. మనం ఎవరివైపు ఉందాం?’ అని కళాకారులు ప్రతి ఇంటి వద్ద ప్రశ్నించగానే.. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని ప్రజలు బీఆర్ఎస్కు జై కొడుతున్నారు.
జోరుగా సభ్యత్వ నమోదు
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం, పార్టీ నిర్మాణం ఏకకాలంలో జోరుగా సాగుతున్నాయి. పార్టీ సభ్యత్వ నమోదు కోసం వెళ్లే బీఆర్ఎస్ బృందాలకు మహారాష్ట్ర వాసులు అపూర్వస్వాగతం పలుకుతున్నారు. రాష్ట్రంలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తున్నారు. నియోజకవర్గానికో ప్రత్యేక వాహనంలో నాయకులు గ్రామాల్లోకి వెళ్లి తెలంగాణ మాడల్ ఎందుకు అవసరమో వివరిస్తున్నారు.
‘మహారాష్ట్రలో సభ్యత్వ నమోదుకు వెళ్లే బీఆర్ఎస్ శ్రేణుల కంటే ముందే పార్టీ అధినేత కేసీఆర్ ఆయా గ్రామాల్లోకి వెళ్లిపోయారు. సభ్యత్వ నమోదు సందర్భం గా బీఆర్ఎస్ సిద్ధాంతాలను చాలా సులభంగా అందరికీ వివరించగలుగుతున్నా ం’ అని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత శంకరన్న దోండ్గే పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ విస్తరణ ఉత్సాహం గా సాగుతున్నదని చెప్పారు. మరే ఇతర పార్టీకీ ఇంత తక్కువ సమయంలో ప్రజాదరణ లభించలేదని తెలిపారు.