హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అలైన్మెంట్ ఖరారు కావడంతో మొదటి గెజిట్ను విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏయే గ్రామాల గుండా రీజినల్ రింగ్ రోడ్డు వెళ్తుందో తెలియజేస్తూ రెండు, మూడు రోజుల్లో ప్రాథమిక గెజిట్ను కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ విడుదల చేయనున్నది. గెజిట్ విడుదలయ్యాక సర్వే నంబర్లవారీగా వివరాలు తెలియజేస్తారు. దీనికోసం ఇప్పటికే కేఅండ్జే సంస్థ డీపీఆర్ను రూపొందించే పనిలో ఉన్నది. పూర్తి స్థాయి డీపీఆర్ పూర్తయ్యాక సర్వే నంబర్లవారీగా భూముల వివరాలను జాతీయ రహదారుల సంస్థ వెల్లడిస్తుంది. దీనికి కేంద్రం మరో గెజిట్ను విడుదల చేస్తుంది. భూసేకణ పూర్తిచేయడానికి ప్రాథమిక గెజిట్ నుంచి 3(a), 3(A), 3(డీ), 3(జీ), 3(హెచ్) వరకు గెజిట్లు విడుదల చేస్తారు.
ఉత్తర భాగంలో నిర్మించే ట్రిపుల్ ఆర్ 158 కిలోమీటర్లు ఉంటుంది. యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 19 మండలాలకు చెందిన 113 గ్రామాల మీదుగా ఈ రోడ్డు నిర్మితమవుతుంది. జంక్షన్లు మినహా మిగిలిన రోడ్డంతా 100 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరిస్తారు. ఈ మేరకు జాతీయ రహదారుల సంస్థ ఆయా భూముల్లో హద్దురాళ్లను కూడా ఏర్పాటు చేసింది. రూ.9,600 కోట్ల ఖర్చుతో నిర్మించతలపెట్టిన ఈ రహదారికి 1,900 హెక్టార్ల భూమి అవసరం అవుతుంది. దీనిని పూర్తిగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే పద్ధతిలో నిర్మిస్తున్నారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం ఖర్చును భరిస్తున్నది. ఇందుకు ఇటీవలి బడ్జెట్లో రూ.500 కోట్లు కూడా కేటాయించింది.