హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం నిర్మాణానికి అవసరమైన భూమిని స్వాధీనం చేసుకొనేందుకు హద్దు రాళ్లను ఏర్పాటుచేసే ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. దీనిలో భాగంగా రెవెన్యూ అధికారులతోపాటు జాతీయ రహదారుల సంస్థ నియమించిన కేఅండ్జే కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులు ఈ నెల 1 నుంచి జాయింట్ సర్వే చేస్తున్నారు. నెల రోజుల్లోగా ఈ సర్వే పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత 3(డీ) గెజిట్ విడుదల చేస్తారు. ఇప్పటికే కేఅండ్జే సంస్థ క్షేత్రస్థాయిలో సర్వే జరిపి, ఏ సర్వే నంబర్లో ఎంత భూమి అవసరమవుతుందో నిర్దిష్టంగా కొలతలు వేసి ఇచ్చింది. దీంతో భూసేకరణకు కేంద్ర ఉపరితల రవాణశాఖ క్యాపిటల్ ‘ఏ’ గెజిట్ విడుదల చేసింది. దీని ఆధారంగా భూసేకరణ జరిపేందుకు రైతులు, భూమి యజమానుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు.
144 ఎకరాల భూమి కోసం..
రాష్ట్ర, జాతీయ రహదారుల నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు వాహనాల రాకపోకలు సాగించడానికి వీలుగా ట్రిపుల్ఆర్ ఉత్తర భాగంలో 11 చోట్ల ఇంటర్ చేంజ్లు నిర్మిస్తున్నారు. పూర్తిగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పద్ధతిలో నిర్మిస్తున్న ఈ రహదారిపైకి ఇంటర్ చేంజ్ ఉన్న చోట్ల నుంచి మాత్రమే వాహనాలు వెళతాయి. మిగతా చోట్ల ఈ రోడ్డుపైకి యాక్సెస్ ఉండదు. ఈ 11 ప్రాంతాల్లో 3 చోట్ల అదనంగా భూమిని సేకరించాల్సి ఉన్నది. ముఖ్యంగా హైదరాబాద్-నాందేడ్ జాతీయ రహదారిపై శివంపేట వద్ద, హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై రాయగిరి వద్ద, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ వద్ద ఇంటర్ చేంజ్ల నిర్మాణానికి 57.85 హైక్టార్ల (144.625 ఎకరాల) భూమి కోసం అదనంగా మరో 3 క్యాపిటల్ (ఏ) గెజిట్లు విడుదల కావాల్సి ఉన్నది. ఇవి దాదాపు ఫైనల్ అయ్యాయని, ఈ ఫైళ్లపై కేంద్ర ఉపరితల రవాణ మంత్రిత్వ శాఖ సంతకం చేయగానే గెజిట్లు విడుదలవుతాయని అధికారులు చెప్తున్నారు. అయితే జోగిపేట-ఆందోల్, నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ల మధ్య 7 కిలోమీటర్ల మేరకు మిస్ అయిన రహదారికి భూమిని ఎలా సేకరించాలన్నదానిపై స్పష్టత రాలేదు. ఈ భూమి సేకరణకు అదనంగా మరో గెజిట్ విడుదల చేయవచ్చని అధికారులు చెప్తున్నారు.