వాషింగ్టన్ : ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఎన్నో ఒత్తిళ్ల మధ్య సగటు జీవి కుంగుబాటుకు లోనవడం మామూలు విషయంగా మారింది. అయితే ప్రతిరోజూ నిద్ర లేచే సమయానికి కంటే గంట ముందుగా లేవడం ద్వారా డిప్రెషన్ కు లోనయ్యే ముప్పు 23 శాతం తగ్గుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. నిర్ధిష్ట సమయంలో వ్యక్తి నిద్రకు ఉపక్రమించే షెడ్యూల్ కుంగుబాటు ముప్పుపై ప్రభావం చూపుతుందని యూనివర్సిటీ ఆఫ్ కొలరడో బౌల్డర్, బ్రాడ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎంఐటీ, హార్వర్డ్ చేపట్టిన అథ్యయనంలో పరిశోధకులు గుర్తించారు.
8,40,000 మందిని పరిశీలించిన మీదట అథ్యయనంలో వెల్లడైన అంశాలను జామా సైకియాట్రీ జర్నల్ లో ప్రచురించారు. నిద్రించే సమయంలో చిన్న మార్పు ద్వారా మానసిక ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుచుకోవచ్చని అథ్యయనం స్పష్టం చేసింది. నిద్ర లేమిని అధిగమించడంతో పాటు త్వరగా పడుకుని త్వరగా నిద్రలేవడం ద్వారా కుంగుబాటు ముప్పు నివారించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ఇక పగటి పూట వెలుతురు ఉండేలా, రాత్రి సమయంలో మిరుమిట్లు గొలిపే లైట్లు లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.