హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ)/చేవెళ్లటౌన్: బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి, బహుజన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు కాంగ్రెస్ ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కారు తొలగించడంతోపాటు గన్మెన్ల భద్రతను కుదించడం దుర్మార్గ చర్యగా భావిస్తూ దళిత సంఘాల జేఏసీ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్లోని నాచారంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నాచారం సీఐకి వినతిపత్రం అందజేశారు. బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం ఐపీఎస్ అధికారికి చట్టపరంగా కల్పించాల్సిన భద్రతను ప్రభుత్వం కుట్రతో తొలగించిందని ఆరోపించారు.
చేవెళ్లలో బీఆర్ఎస్ రాస్తారోకో
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీఆర్ఎస్ నాయకులు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయార్య క్షత్రియ, చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి దేశమోళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ.. పోక్సో కేసులో బండి భగీరథ్ను అరెస్టు చేయాలని ఉద్యమాన్ని నడిపినందుకు ఆర్ఎస్పీపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి, సీఎం రేవంత్రెడ్డి కక్షపూరితంగా భద్రతను తొలగించడం దారుణమని పేర్కొన్నారు.