హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) ః టీఎస్బీపాస్ విధానంలో ఇండ్లు, లే అవుట్లు, వాణిజ్య భవనాలకు అనుమతులు నిర్ణీత సమయంలో లభిస్తున్నాయి. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చింది. గతంలో ఈ విధానంలో తిరస్కరించిన దరఖాస్తుదారులకు వారు చెల్లించిన దబ్బులు తిరిగి రావడానికి చాలా రోజులు పట్టేది. కొందరు దరఖాస్తుదారులు అయితే తమ డబ్బు వస్తుందో? రాదో? అని ఆందోళన చెందిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రి కేటీఆర్ సూచించడంతో అధికారులు, బ్యాంకర్లు సాఫ్ట్వేర్లో మార్పులు చేర్పులు చేసి, నిరంతర పర్యవేక్షణతో రిఫండ్ త్వరగా వచ్చే విధంగా చేశారు. ప్రస్తుతం గరిష్ఠంగా నాలుగు బ్యాంకు పనిదినాల్లో రిఫండ్ యజమాని ఖాతాలో జమ అవుతున్నది.
తగ్గిన పెండింగ్ జాబితా
దరఖాస్తులు ఎక్కువ కాలం పెండింగ్లో ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. దరఖాస్తుపై అధికారులు సైట్ వెరిఫికేషన్, టైటిల్ వెరిఫికేషన్, టెక్నికల్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. వీటి పరిశీలన పూర్తి చేసి నిర్ణీత 21 రోజుల్లోగా దరఖాస్తుదారుడికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. లేకుంటే ఇంటి యజమానికి డీమ్డ్ టూ అప్రూవల్ విధానంలో అనుమతులు ఇస్తున్నారు. తనిఖీ విధానంలో నిర్లక్ష్యం వహించిన వారి వేతనాల్లో కోత విధించడం, కొందరికి మెమోలు జారీ చేయడంతో పరిస్థితిలో పెను మార్పు వచ్చింది. గత సంవత్సరం 33 మంది అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఇందులో హెచ్ఎండీఏ పరిధిలో ఆరుగురు కమిషనర్లు, 27 మంది అధికారులున్నారు. టీఎస్బీపాస్ ప్రారంభమైనప్పటి నాటి నుంచి 60 మంది అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. దీంతో అధికారులంతా అప్రమత్తమై నివేదికలు వెంటనే పంపుతున్నారు. ఫలితంగా నిర్ణీత సమయం కన్నా తక్కువ సమయంలోనే అనుమతులివ్వటానికి ఆస్కారం ఏర్పడింది. ఈ విధానంతో పెండింగ్ దరఖాస్తులు తగ్గి, ఇంటి యజమానులకు ఇబ్బందులు తొలిగిపోయాయి.