రాష్ట్ర ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం బాల్యవివాహాలను నిలువరించిందని జాతీయ కుటుంబ సర్వే లెక్కలు చెప్తున్నాయి. 2015-16లో వెలువడిన నాలుగో జాతీయ కుటుంబ సర్వేకు, 2019-20 సంవత్సరంలో వెల్లడించిన ఐదో కుటుంబ సర్వేను పోల్చి చూస్తే రాష్ట్రంలో బాల్యవివాహాలు తగ్గాయని స్పష్టం అవుతున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సంఖ్య తగ్గటానికి రాష్ట్రంలో అమలవుతున్న కల్యాణలక్ష్మి కీలక పాత్ర పోషించిందని తేలింది. 2018లో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్, ప్లాన్, మహితా స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన శాస్త్రీయ అధ్యయనం కూడా రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో బాల్యవివాహాలు తగ్గాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా మహబూబ్నగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల్లో గణనీయ మార్పులు వచ్చాయని పేర్కొన్నది.
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో బాల్యవివాహాలు జరగవద్దనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చిన్నపిల్లల పెండ్లిళ్లకు అడ్డుకట్ట వేస్తూ దేశంలోనే ముందువరుసలో నిలిచింది. దేశంలో ఒకవైపు కరోనా విలయతాండవం చేస్తుంటే.. మరోవైపు బాల్యవివాహాలు జోరుగా జరిగాయని లెక్కలు చెప్తున్నాయి. రాష్ట్రం లో మాత్రం సెప్టెంబర్-మే మధ్యకాలం లో 1,176 బాల్యవివాహాలను ప్రభుత్వం అడ్డుకొన్నది. ఏప్రిల్, మే నెలల్లోనే 390 బాల్యవివాహాలను ఆయా జిల్లాల బాలల హక్కుల రక్షణ విభాగాలు అడ్డుకొన్నాయి. వికారాబాద్ జిల్లాలోనే అధికంగా బాల్యవివాహాలను ఆపారు. ఆ తర్వాతి స్థానంలో మహబూబాబాద్ జిల్లా ఉన్నది. తెలంగాణను బాల్యవివాహాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. కల్యాణలక్ష్మి ప థకంతో పెద్దఎత్తున బాల్య వివాహాలను నిరోధిస్తున్న సర్కారు.. స్త్రీ, శిశు సంక్షేమశాఖ పర్యవేక్షణలో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు బాలల హక్కుల పరిరక్షణకు పాటుపడుతున్నాయి.
మహబూబాబాద్ జిల్లాను బాల్యవివాహ రహిత జిల్లాగా చేసేందుకు ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. ఆ జిల్లాలో వికారాబాద్ ఫార్ములాను అనుసరించబోతున్నది. వికారాబాద్లో జిల్లా చైల్డ్ప్రొటెక్షన్ కమిటీలు, మండల కమిటీల ద్వారా ఊరూరా చైతన్యాన్ని కల్పించారు. ఫలితంగా 26 నెలల్లో 286 బాల్యవివాహాలకు అడ్డకట్టపడింది. దీంతో మహబూబాబాద్ జిల్లాలోనూ ఇదే పంథాను కొనసాగించనున్నారు. ఇటీవలే గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖమంత్రి జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా సంక్షేమ అధికారి, సీడీపీవోలు, ఆ జిల్లాలో పనిచేస్తున్న ఎన్జీవో ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి బాల్యవివాహాల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. అటు.. మహిళాసంఘాలు కూడా చురుకైన పాత్ర పోషించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి గుడి ముందు బాల్యవివాహాల నిషేధ చట్టం-2006 ప్రకారం బాల్యవివాహం చేసుకొంటే రెండేండ్ల జైలు లేదా లక్ష రూపాయల జరిమాన విధిస్తామని చెప్పే బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీఅయ్యా యి. అంతేకాకుండా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రతి గ్రామంలో చైల్డ్ లైన్ నెంబర్ 1090, డయల్ 100 నెంబర్ను గ్రామాల కూడళ్లలో ప్రదర్శించే ఏర్పాట్లు చేస్తున్నారు.