హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని ప్రభుత్వ దవాఖానల్లో సిజేరియన్ కేసులు తగ్గడం అభినందనీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ఈ దిశగా ప్రైవేట్ దవాఖానలు సైతం దృష్టిసారించాలని సూచించారు. శుక్రవారం ఢిల్లీలోని ఉప రాష్ట్రపతి నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్త్రీవైద్య నిపుణురాలు డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్కు 29వ యుధ్వీర్ స్మారక అవార్డును వెంకయ్య ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల ఆరోగ్యాన్ని విస్మరిస్తే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యపడదన్నారు. మహిళల ఆరోగ్యసంరక్షణ, పునరుత్పత్తి అంశాల్లో డాక్టర్ ఎవిటా సేవలను ఉపరాష్ట్రపతి అభినందించారు. ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు పెంచే లక్ష్యంతో యునిసెఫ్తో కలిసి తెలంగాణ ప్రభుత్వం, ఫెర్నాండెజ్ దవాఖానలు చేసిన కృషిని వెంకయ్య గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా దివంగత యుధ్వీర్ చిత్రపటానికి వెంకయ్య నివాళి అర్పించారు. కార్యక్రమంలో యుధ్వీర్ ఫౌండేషన్ చైర్మన్ మురళీధర్ గుప్తా, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.