హైదరాబాద్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): అన్యాక్రాంతమైన దేవాదాయశాఖ భూములను తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు ఏడాదిన్నర క్రితం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ ఫలితాలిస్తున్నది. రాష్ట్రంలోని పాత పది ఉమ్మడి జిల్లాల పరిధిలో ఇప్పటివరకు మొత్తం 2,622.03 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లాలో అత్యధికంగా 1,040.15 ఎకరాలు, నల్లగొండలో 502.01, నిజామాబాద్లో 223.21, ఖమ్మంలో 208.29, కరీంనగర్లో 186.26, వరంగల్లో 185.14, రంగారెడ్డిలో 132.10, ఆదిలాబాద్లో 115.35, మెదక్లో 22.25, హైదరాబాద్లో 4.27ఎకరాల భూములను దేవాదాయశాఖ స్వాధీనం చేసుకున్నది. ఇవికాకుండా సుమారు పదివేల ఎకరాల భూములపై కోర్టులో కేసులు నడుస్తున్నట్టు దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్ తెలిపారు. అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకునేంతవరకు డ్రైవ్ కొనసాగుతుందని పేర్కొన్నారు. కరోనా కారణంగా డ్రైవ్కు కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ తిరిగి ప్రారంభించామని చెప్పారు. దేవాదాయ భూములను కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకోవడంలో కృషిచేసిన అధికారులను దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అభినందించారు.