Redco Chairman Y Satish Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : తుక్కుగూడ సభలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు చూస్తుంటే సచ్చిపోయిన బర్రె పగిలిపోయిన బుడ్డెడు పాలిచ్చేది అన్నట్లు ఉందని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టిని మరల్చాలన్న ఏకైక లక్ష్యంతోనే వారు హామీలు గుప్పించారని విమర్శించారు. అసలు కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరనేది గ్యారంటీ లేదన్నారు.
ఎవరినైనా సీఎం అభ్యర్థిగా ప్రకటించినా అతను ఐదేండ్లు ఉంటాడన్న గ్యారంటీ లేదని వై సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ నాయకులొచ్చి సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే మిగతా నాయకులు ఒప్పుకుంటారన్న గ్యారంటీ కూడా లేదన్నారు. ఇప్పుడు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఎవరు అమలు చేసేదెవరన్న గ్యారంటీ కూడా లేదని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎలాంటి గ్యారంటీ లేకుండా గాలికి ఇచ్చే గ్యారంటీలను తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో గెలుపు గ్యారంటీ లేదని తేల్చిచెప్పారు.
తెలంగాణలో గుప్పించిన హామీలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని వై సతీశ్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రూ. 500లకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారా? అని నిలదీశారు. బూటకపు గ్యారంటీలతో మరోసారి తమ గొంతు కోయాలని చూస్తే చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కారన్నారు.
కొద్ది రోజుల క్రితం కర్ణాటకలో ఇలాంటి హామీలే ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల తిరక్క ముందే కరెంటు చార్జీలు పెంచి ప్రజల ఉసురు పోసుకున్నారని వై సతీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరెంటు కోతలు విధించి అన్ని వర్గాలను దెబ్బతీశారన్నారు. అలవిగాని హామీలిచ్చి వాటిని అమలు చేసేందుకు డబ్బుల్లేక ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించిన సంగతి దేశమంతా చూసిందదన్నారు.
ఇప్పుడు తెలంగాణకు వచ్చి ప్రజలను డైవర్ట్ చేయడానికి గ్యారంటీల పేరుతో గాలం వేయాలని చూస్తున్నారని వై సతీశ్ రెడ్డి విమర్శించారు. తొమ్మిదిన్నర ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ నేడు కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలన్నీ.. బీఆర్ఎస్ ప్రభుత్వ మానస పుత్రికలేనని అన్నారు.
50 ఏండ్లు దేశాన్ని పాలించి కనీసం ఆలోచన కూడా చేయని పథకాలను సీఎం కేసీఆర్ విజయవంతంగా అమలు చేసి చూపారని వై సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార కాంక్షతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలనే కాపీ కొడుతున్నదన్నారు. ఏ మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా బీఆర్ఎస్ పథకాలకు పేరుమార్చి గ్యారంటీల పేరుతో ప్రకటించారన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన కుంభకోణం తెలంగాణ ప్రజలందరికి తెలుసని, ఇండ్లు కట్టకుండానే పైసలు మింగిన దగాకోరులు కాంగ్రెస్ నాయకులని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి పారదర్శకంగా నిజమైన లబ్ధిదారులకు అందిస్తున్నదని వై సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో విద్యను కార్పొరేట్ల గుప్పిట్లో పెట్టేస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసి పేదింటి బిడ్డలకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందిస్తున్నదన్నారు.
కాంగ్రెస్ పార్టీ రైతులకు తమ భూమిపై హక్కు లేకుండా చేస్తే.. ధరణితో రైతుకు భరోసానిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమని వై సతీశ్ రెడ్డి గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్షకోట్ల అవినీతి అని మాట్లాడుతున్న రాహుల్ గాంధీ అవివేకాన్ని చూసి ఏమనాలో అర్థం కావడం లేదని అన్నారు. గతంలో రేవంత్ రెడ్డి అన్నట్టు రాహుల్ గాంధీ నిజంగానే ముద్దపప్పులాగా మాట్లాడుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడానికే లక్షకోట్లు కాలేదని, అలాంటి ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతి జరిగిందని మాట్లాడటం ఆయన తెలివితక్కువతనానికి నిదర్శనమన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, దాని ద్వారా పారుతున్న నీళ్లు, పచ్చబడిన భూములు కండ్లముందే కనిపిస్తున్నాయని వై సతీశ్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ వరింగ్ కమిటీనే పూర్తిగా సాములు చేసిన వాళ్లతో నిండిపోయి ఉందని, అలాంటి మీరు మచ్చలేని మనిషి, సంక్షేమ సారథి కేసీఆర్ మీద విమర్శలు చేయడం ఆకాశం మీద ఉమ్మి వేయడం లాంటిదే అవుతుందని సతీష్ రెడ్డి విమర్శించారు.