హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ టూ వీలర్లపై ఇన్సెంటివ్స్ తగ్గిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేయడం పర్యావరణ పరిరక్షణ చర్యలకు గొడ్డలిపెట్టులాంటిదని తెలంగాణ పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (రెడ్కో) చైర్మన్ వై సతీశ్రెడ్డి మండిపడ్డారు. ఇప్పటివరకూ ఒకో ఎలక్ట్రిక్ టూవీలర్పై రూ.15 వేల ఇన్సెంటివ్ ఉండేదని, దాన్ని రూ.10 వేలకు తగ్గించారని చెప్పారు. కేంద్రం చర్యలు ఈవీ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ సర్కారు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఈవీ పాలసీని తీసుకొచ్చి.. 2 లక్షల ద్విచక్రవాహనాలు, 5 వేల ఫోర్ వీలర్స్, 500 బస్సులు, 20 వేల ఆటోలకు రిజిస్ట్రేషన్ చార్జీలు, రోడ్ ట్యాక్స్ లో మినహాయింపు ఇచ్చిందని గుర్తుచేశారు. ఈవీపై ప్రజల ఆసక్తిని గమనించిన సీఎం కేసీఆర్, కేటీఆర్ ఇప్పటికే ప్రకటించిన 5 వేల ఫోర్ వీలర్స్కు అదనంగా మరో 2 వేల వాహనాలకు రిజిస్ట్రేషన్ చార్జీలు, రోడ్ ట్యాక్స్లో మినహాయింపు ప్రకటించారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఈవీతోపాటు సోలార్ పైనా ట్యాక్సుల భారం మోపిందని పేర్కొన్నారు.