హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): పీడిత ప్రజల కోసం, తెలంగాణ సాధ న కోసం పోరాడిన గద్దర్ మరణాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్న నీచుడు రేవంత్రెడ్డి అని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓట్ల కోసం రేవంత్రెడ్డి ఎంతకైనా దిగజారుతాడని, వీరుల మరణాన్ని కూడా వాడుకుంటాడని మరోసారి స్పష్టమైందని మండిపడ్డారు. శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి దిగజారి మాట్లాడుతున్నాడని మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
గద్దర్ వెన్నులో ఉన్న బుల్లెట్ను దించింది రేవంత్రెడ్డి గురువైన చంద్రబాబు సర్కారేనని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడే వరకు అదే చంద్రబాబు నాయుడు వెంట తిరిగిన రేవంత్రెడ్డికి ఈ విషయం తెలియదా? అని ప్రశ్నించారు. చర్చల పేరుతో గద్దర్ సహచరులను ఎన్కౌంటర్లో చంపింది ఇప్పుడు రేవంత్రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు.