హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): ములుగు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్తున్న పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆ జిల్లా అభివృద్ధి గురించి ఎన్నడూ పట్టించుకోలేదని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి ధ్వజమెత్తారు. ఏ ముఖం పెట్టుకొని ములుగు నుంచి పాదయాత్ర చేస్తావని రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. వెనకబడిన ములుగు జిల్లాకు ప్రత్యేకంగా నిధులు కావాలని ఎన్నడైనా కేంద్రాన్ని అడిగావా? రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్నో ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం గిరిజన జాతరకు జాతీయ పండుగ హోదా ఎందుకు ఇవ్వలేదు? అని నిలదీశారు.
గిరిజనులు అధికంగా ఉండే ములుగు జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, యునెసో గుర్తింపు పొందిన చారిత్రక వారసత్వ కట్టడం రామప్పను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని రేవంత్రెడ్డి పార్లమెంట్లో ఎన్నడైనా కేంద్రాన్ని డిమాండ్ చేశారా? అని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్రలో పాల్గొన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క.. రామప్ప అభివృద్ధిలో జరుగుతున్న అన్యాయం, మేడారం జాతరకు జాతీయ హోదా, గిరిజన యూనివర్సిటీ గురించి రాహుల్ గాంధీని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రెండు జిల్లాల్లో ములుగుకు స్థానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని సతీశ్రెడ్డి పేర్కొన్నారు.