వరంగల్ : ఎర్ర బంగారం ధర పసిడితో పోటీ పడుతుంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశి రకం మిర్చికి ఈరోజు రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాల్ ధర రూ. 45,000. కొద్ది రోజుల క్రితం ఇదే మార్కెట్లో దేశి రకం మిర్చికి ధర రూ.44,000 పలికింది. ఈరోజు దీని ధర రూ. 45 వేలకు చేరింది.
భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కపల్లి గ్రామానికి చెందిన రైతు లింగేశ్వరరావు 24 బస్తాల దేశి రకం మిర్చితో మార్కెట్కు తెచ్చాడు. లోకేశ్వర కంపెనీ ఖరీదుదారులు దీనికి రూ. 45,000 నిర్ణయించారు. దేశి రకం మిర్చికి క్వింటాల్ ధర రూ. 45,000 పలకడం ఇదే తొలిసారి.
ఈ మార్కెట్లో పత్తికి కూడా ఈరోజు రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాల్ రూ. 10,720. భూపాలపల్లి జిల్లా పెరికపల్లి గ్రామ రైతు రాజు తెచ్చిన 40 బస్తాల పత్తికి ఈ ధర పొందాడు. పత్తికి మునుపెన్నడూ మార్కెట్లో ఇంత ధర పలకలేదు.