వరంగల్ : ఎర్ర బంగారం ధర రోజు రోజుకి పెరుగుతుంది. దేశి రకం మిర్చికి ఈ రోజు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాల్ ధర రూ. 44,000 నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కపల్లి గ్రామ రైతు సామినేని నాగేశ్వరరావు 66 బస్తాల ద్వారా దేశి రకం మిర్చిని మార్కెట్కు తెచ్చారు. జితిన్ ట్రేడింగ్ కంపెనీ ఖరీదుదారులు దీనికి ధర రూ. 44 వేలు నిర్ణయించారు.
ఇప్పటివరకు దేశి రకం మిర్చికి ఇదే అత్యధిక ధర. కొద్ది రోజుల క్రితం ఇక్కడ దేశి రకం మిర్చికి క్వింటాల్ ధర రూ. 37,000 పలికింది. ఈరోజు అనూహ్యంగా రూ. 44,000 ఎగబాకింది. ఇదే మార్కెట్ లో కొద్ది రోజుల క్రితం సింగిల్ పట్టీ రకం మిర్చి ధర క్వింటాల్ రూ. 42,500 పలికింది. మార్కెట్ చరిత్రలో మిర్చికి ధర క్వింటాల్ రూ. 44,000 నమోదు కావటం ఆల్ టైం రికార్డు.