హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): మన ఊరు-మన బడి.. ఇంగ్లిష్ మీడియం చదువులతో ఈ ఏడాది సర్కారు బడుల్లో రికార్డుస్థాయి అడ్మిషన్లు నమోదయ్యాయి. ఇప్పటివరకు 2,07,474 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. వీరిలో 79 వేల మంది ప్రైవేట్ స్కూళ్ల నుంచి వచ్చి చేరడం విశేషం. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. గతంలో వారం రోజులపాటు మాత్రమే బడిబాట నిర్వహించగా, ఈ ఏడాది నెల రోజులపాటు చేపట్టారు. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చింది. తల్లిదండ్రుల తాకిడి తీవ్రమవుతుండటంతో ఇంకా అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల పరిధిలోనే 50 వేల పైచిలుకు కొత్త అడ్మిషన్లు నమోదయ్యాయి.
200 బడుల్లో తీవ్ర డిమాండ్..
ఇది వరకు రాష్ట్రంలోని కొన్ని బడుల్లో మాత్రమే అడ్మిషన్లకు తీవ్ర డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు 200 పైచిలుకు సర్కారు బడుల్లో అడ్మిషన్లకు తీవ్ర డిమాండ్ నెలకొన్నది. ఈ బడుల్లో చేరాలంటే తీవ్రమైన పోటీని తట్టుకోవాల్సిందే. హైదరాబాద్ సోమాజిగూడలోని రాజ్భవన్ స్కూల్, బోరబండ నాట్కో స్కూల్, సిద్దిపేట ఇందిరానగర్ వంటి మొత్తంగా 200 స్కూళ్లల్లో అడ్మిషన్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొన్నది. కొన్నింటిలో నో అడ్మిషన్ బోర్డులు ఏర్పాటుచేసినా తల్లిదండ్రులు పిల్లల అడ్మిషన్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
తల్లిదండ్రుల్లో మార్పు..
ప్రైవేట్ చదువుల కోసం ఇంతకాలం తహతహలాడిన తల్లిదండ్రుల వైఖరిలో మార్పు కనిపిస్తున్నది. ఇది వరకు సగటు తల్లిదండ్రులంతా అప్పో.. సప్పో చేసి అయినా కాన్వెంట్ చదువుల వైపు మొగ్గుచూపేవారు. రాష్ట్రంలో 26, 807 సర్కారు బడుల్లో 42.83 శాతం విద్యార్థులుంటే, 11,151 ప్రైవేట్ స్కూళ్లల్లో 48.19 శాతం విద్యార్థులున్నారు. తల్లిదండ్రుల్లో క్రమంగా మార్పు కనిపిస్తున్నది. ఒకప్పుడు ప్రైవేట్ బాట పట్టిన తల్లిదండ్రులే ఏరికోరి సర్కారు స్కూళ్లవైపు చూస్తున్నారు. కరోనా ప్రభావం సైతం ఇందుకు కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. సర్కారు బడులను అందంగా తీర్చిదిద్దుతుండటం సైతం ఇందుకు ఒక కారణంగా ఉపాధ్యాయులు చెప్తున్నారు.
సర్కారు బడుల్లో చేరికలకు కారణాలు..
ఈ ఏడాది కొత్త అడ్మిషన్లు..
పూర్వప్రాథమిక తరగతుల్లో : 2,371
ఒకటో తరగతిలో: 1,39,273
ప్రైవేట్ నుంచి
(2- 12వ తరగతి వరకు) : 65,830
మొత్తం : 2,07,474
ఒకటో తరగతిలో చేరినవారు
అంగన్వాడీల నుంచి: 95,129
ప్రైవేట్ స్కూళ్ల నుంచి: 13,379
నేరుగా ప్రవేశాలు: 30,765
మొత్తం : 1,39,273
ఇంగ్లిష్ మీడియం విప్లవాత్మకం
అన్ని వర్గాల ఆకాంక్షలకనుగుణంగా ఈ విద్యాసంవత్సరం నుంచి అన్ని సర్కారు స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభించాం. సీఎం కేసీఆర్ ఆశయాలకనుగుణంగా ఇంగ్లిష్ మీడియం రాష్ట్ర విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కారణమయ్యింది. గతేడాది 3 లక్షల మంది విద్యార్థులు చేరితే, ఈ సారి సైతం 2 లక్షల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందడం శుభపరిణామం. ఇప్పటికే పలు స్కూళ్లల్లో ‘నో అడ్మిషన్’ బోర్డులు పెట్టాల్సి వస్తున్నది. మన ఊరు -మన బడి కార్యక్రమ పనులు పూర్తయితే చాలా స్కూళ్లల్లో నో అడ్మిషన్ బోర్డులు పెట్టాల్సి వస్తుంది.
– సబితాఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
ఈ ఏడాది 330 మంది చేరారు
ఈ ఏడాది మా స్కూల్లో అడ్మిషన్ల తాకిడి తీవ్రంగా ఉన్నది. ప్రాథమిక పాఠశాలలోనే గతేడాది 650 విద్యార్థులుంటే, కొత్తగా 330 మంది విద్యార్థులు చేరారు. ఇంకా అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు వచ్చిపోతున్నారు. నో ఆడ్మిషన్ బోర్డులు పెట్టినా తాకిడి తగ్గడం లేదు. మొత్తం ఒకటి నుంచి 10వ తరగతి వరకు 3 వేల మంది విద్యార్థులున్నారు.
– మామిడోజు వీరాచారి, టీచర్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (నాట్కో) బోరబండ