వరంగల్ : వేయి స్తంభాల గుడి పునర్నిర్మాణం పనులు వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అధికారులను ఆదేశించారు. వరంగల్ కలెక్టరేట్ లో బుధవారం కలెక్టర్, సంబంధిత అధికారులతో వారు సమీక్ష నిర్వహించారు.
చారిత్రక వరంగల్ కు అత్యంత ఖ్యాతి తెచ్చిన వేయిస్తంభాల గుడి ని తిరిగి అదే స్థాయిలో పునర్నిర్మాణం చేయాలన్నారు. ఇప్పటికే వివిధ సాంకేతిక కారణాలతో జరిగిన ఆలస్యాన్ని ఇక ముందు జరుగకుండా అధిగమించాలని మంత్రి సూచించారు. 2023 మార్చి 31 లోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. వేయి స్తంభాల దేవాలయంతో పాటు వరంగల్ కోట, జైన మందిరాలపై కూడా వారు సమీక్ష నిర్వహించారు.
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ ఇచ్చిన కోటి రూపాయలతో పాటు అవసరం ఉన్న నిధులను సమకూర్చాలని సూచించారు. ఈ సమీక్షలో టూరిజం, సాంస్కృతిక శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జనగామ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు, కుడా అధికారులు, అడిషనల్ కలెక్టర్లు, డీఆర్డీఓ లు, టూరిజం, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.