UNESCO | హైదరాబాద్, మార్చి 14: తెలంగాణలోని నిలువురాళ్లకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో చోటు లభించింది. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమూల్లో ఆది మానవుల ఖగోళ పరిజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న ఈ నిలువు రాళ్లకు ఈ హోదా వచ్చినట్టు పారిస్లోని యునెస్కో భారత దేశ శాశ్వత ప్రతినిధి బృందానికి వెల్లడించింది. అశోక శాసన ప్రదేశాలు, 64 యోగిని దేవాలయాలు సహా భారత్లోని ఆరు వారసత్వ ప్రదేశాలు యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఇందులో ముడుమూల్లోని నిలువురాళ్లకు ఈ గౌరవం దక్కింది.
శిలాయగంలోనే వాతావరణ మార్పులు, రుతువులు, కాలాలను గుర్తించడానికి ఆది మానవులు వీటిని ఏర్పాటు చేసుకున్నట్టు చారిత్రక పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ నిలువురాళ్లు శిలా యుగానికి సంబంధించిన ఆనవాళ్లని చారిత్రక పరిశోధకులు తెలిపారు. 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో 100 వరకు గండ శిలలు ఉండ గా, ఒక్కోటి 12 నుంచి 14 అడుగుల ఎత్తు వరకు ఉన్నాయి. చిన్న చిన్న రాళ్లు మరో 2 వేల వరకు ఉంటాయి. ఆకాశంలో నక్షత్రాలను చూసి దిక్కులు, సమయాన్ని కచ్చితంగా గుర్తించేందుకు ఒక రాయిపై సప్తర్షి మండలాన్ని ఏర్పాటు చేశారు. తాత్కాలిక జాబితాలో చేర్చిన మిగతా ప్రదేశాల్లో ఛత్తీస్గఢ్లోని కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్, పలు రాష్ర్టాల్లోనిర్మించిన అశోక శానన ప్రదేశాలు, చౌసత్ యోగిని దేవాలయాలు, ఉత్తర భారతదేశంలోని గుప్త దేవాలయాలు, మధ్యప్రదేశ్, యూపీలోని బుందేలాస్ రాజభవనాలు, కోటలు ఉన్నాయి.