హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణలోని మహిళలకు సరైన గుర్తింపు వచ్చిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘కేసీఆర్ మహిళబంధు’ పేరిట వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సోమవారం తెలంగాణ భవన్లో అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనపరిచిన మహిళలను మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణి దేవి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి ఇతర నేతలు కలిసి సన్మానం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ..రాష్ట్రంలో కరోనా సమయంలో కష్టపడిన వారిని, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న వారిని నేడు సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. బడ్జెట్లో మహిళలకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యమిచ్చారన్నారు.
మహిళలకు ఇంత చేస్తున్న సీఎం కేసిఆర్ అందరి ఆయుష్షు పోసుకుని మరిన్ని కార్యక్రమాలూ చేయాలని కోరుతూ…ఆడబిడ్డలు అందరూ నిండు మనసుతో దీవించాలన్నారు.మహిళా దినోత్సవాన్ని ఒక రోజు కాదు, అన్ని రోజులు జరుపుకోవాలన్నారు. ఎందుకంటే మహిళలు లేకుండా ఒకరోజు కూడా గడవదని తెలిపారు.