కరీంనగర్, డిసెంబర్ 4 : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండు రోజులు కాకముందే సింగరేణి(Singareni)లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి తేదీని ఖరారు చేశారు. సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు(Recognition election) సంబంధించి గతంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ ప్రక్రియ చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం, సింగరేణి ఎన్నికలను నిర్వహించే పరిస్థితి లేకుండా పోవడంతో అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిర్వహించాలని నిర్ణయించారు.
సోమవారం హైదరాబాద్లో డిప్యూటీ లేబర్ కమిషనర్ సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు సమక్షంలో జరిగిన సమావేశంలో టీబీజీకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డితోపాటు జాతీయ సంఘాల నాయకులు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, విప్లవ కార్మిక సంఘాలైన ఐఎఫ్టీయూ, ఇతర సంఘాల నాయకులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికలకు సంబంధించి ఏకాభిప్రాయానికి రావడంతో 27న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈమేరకు సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికుల ఓటరు లిస్టును ఎన్నికల అధికారి కార్మిక సంఘాల నాయకులకు అందజేశారు.