WhatsApp : వాట్సాప్ త్వరలో యూజర్నేమ్ ఫీచర్ ప్రవేశపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరికల్లా ఈ ఫీచర్ తీసుకురావాలని వాట్సాప్ మాతృసంస్థ మెటా నిర్ణయించింది. అయితే, ఈ ఫీచర్పై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఈ ఫీచర్కు సంబంధించిన పూర్తి అంశాలతో వివరణ ఇవ్వాలని కోరుతూ వాట్సాప్ మాతృసంస్థ మెటాకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుంది, భద్రత ప్రమాణాలు వంటి అంశాలను వివరించాలని కోరింది.
అప్పటివరకు ఇండియన్స్కు ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురాకూడదని ఆదేశించింది. ఈ ఫీచర్ విషయంలో కేంద్రానికి నివేదిక సమర్పించి, పూర్తి అనుమతులు పొందిన తర్వాతే ముందుకెళ్లాలని నోటీసుల్లో పేర్కొంది. యూజర్నేమ్ ఫీచర్ విషయంలో టెక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఆన్లైన్ మోసాలు అధికంగా జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. యూజర్ నేమ్ వల్ల ఫోన్ నెంబర్ తెలియదని, దీంతో ప్రముఖుల పేర్లతో, ఇతరుల పేర్లతో మోసానికి పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వినియోగదారులకు అసలు అకౌంట్ ఎవరికి సంబంధించిందో తెలిసే అవకాశం ఉండదు. అందుకే ఈ ఫీచర్ విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగాత్మక దశలో ఉంది. ఇండియాలో ఈ ఏడాది చివరి నుంచి ఈ ఫీచర్ అందుబాటులోకి రావొచ్చు. ఇప్పటికే యూజర్ నేమ్స్ రిజర్వ్ చేసుకోవాలని మెటా సంస్థ వాట్సాప్ యూజర్లకు సూచించింది. దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అయితే, కేంద్రం అనుమతించిన తర్వాతే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.