హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు రోజు రోజుకూ జోరందుకుంటున్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోల్చితే మన మార్కెట్ చిన్నదే అయినా ధర లు మాత్రం హైదరాబాద్లోనే తక్కువగా ఉన్నాయి. దీనికి తోడు తెలంగాణలో సుస్థిరమైన ప్రభుత్వం, సమర్థ నాయకత్వం ఉండటంతో అన్ని రంగాల్లోనూ వృద్ధిరేటు ఎంతో ఆశాజనకంగా ఉన్నది. దీంతో పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు పెడుతున్నాయి. నగరానికి అన్ని వైపులా దాదాపు 60 కి.మీ. పరిధిలో భారీ ప్రా జెక్టులను చేపడుతున్నాయి.
హైదరాబాద్కు మణిహారంలా నిలిచిన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)తోపాటు నగరం నలుదిశల్లో జాతీ య, రాష్ట్ర రహదారుల వెంట పెద్ద సంఖ్యలో పారిశ్రామికవాడలు ఏర్పాటవుతుండటమే ఇందుకు కారణం. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఓఆర్ఆర్ అవతల 30-40 కి.మీ. వరకు భారీ పారిశ్రామిక వా డలు ఏర్పాటయ్యాయి. కొత్తూరు మండల పరిధిలోని సిద్దాపూర్ వద్ద 300 ఎకరాల్లో మరో పారిశ్రామికవాడ ఏర్పాటుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. దీనికి తోడుగా ఐటీ, ఫార్మా, లైఫ్సైన్సెస్, ఏరోనాటిక్స్, లాజిస్టిక్ రంగాల్లోనూ జోరు కొనసాగుతుండటంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నానాటికీ గణనీయంగా పెరుగుతున్నది.
శివారు ప్రాంతాలే ఉత్తమం
హైదరాబాద్ కోర్ సిటీలో ఖాళీ స్థలాలు పెద్దగా లేకపోవడం, ఉన్నా వాటి ధరలు అధికంగా ఉండడంతో కొత్తగా నివాసాలు కోసం శివారు ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నారు. బడ్జెట్ ధరల్లోనే ప్లాట్లు కొని, ఇండ్లు నిర్మించుకుంటున్నారు. ప్రస్తుతం కోర్ సిటీలో గజం భూమి ధర రూ.90 వేల నుంచి లక్ష వరకూ పలుకుతుండగా.. శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీలు, ఓఆర్ఆర్ వద్ద రూ.35 వేలలోపే లభిస్తున్నది. దీంతో ఆయా ప్రాంతాల్లో తెలుగువారితోపాటు ఉత్తరాది రాష్ర్టాలవారు కూడా పెద్ద సంఖ్యలో కొనుగోళ్లు జరుపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల్లో గత 9 ఏండ్ల నుంచి రిజిస్ట్రేషన్లు భారీగా పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం.