హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): మోకిల లేఅవుట్లో రెండో విడత ప్లాట్ల విక్రయానికి హెచ్ఎండీఏ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసిం ది. ఐటీ కారిడార్కు సమీపంలో హైదరాబాద్-శంకర్పల్లి మార్గంలో ఉన్న మోకిలలో సుమారు 300 ఎకరాల్లో హెచ్ఎండీఏ లేఅవుట్ను అభివృద్ధి చేసింది. ఇటీవల 50 ప్లాట్లకు నిర్వహించిన తొలివిడత వేలానికి మంచి స్పందన రావడంతో మరో 300 ప్లాట్లను విక్రయించనున్నారు. ఒక్కో ప్లాటు విస్తీర్ణం 300 చదరపు గజాలు మొదలుకొ ని 333, 367, 375, 400, 417, 458, 500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్నాయి. లేఅవుట్కు సంబంధించిన ప్రీబిడ్ మీటింగ్ను ఈ నెల 17న లేఅవుట్లో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. చదర పు గజానికి కనీస ధరను రూ. 25,000గా నిర్ణయించారు. వేలంలో పాల్గొన్న వారు గజానికి రూ.1000 చొప్పున ఒక్కో ప్లాటు కు ఈఎండీ రూపంలో రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుంది. ప్లాట్లను ఆన్లైన్ వేలం ద్వారా కొనుగోలు చేసేందుకు ఈనెల 21వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని, ఈఎండీ చెల్లించాలి. ఈనెల 23, 24, 25, 28, 29 తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున వేలం నిర్వహిస్తారు. ప్రతి రోజు 30 ప్లాట్లకు ఆన్లైన్ వేలం ఉంటుందని, వివరాలకు, మోకిల లే అవుట్ కోసం 95508 81843, 73963 45623 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని హెచ్ఎండీఏ అధికారులు పేర్కొన్నారు.
పెట్టుబడిదారులకు స్వర్గధామం
హైదరాబాద్ నగరాభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రపంచఖ్యాతిని ఆర్జించాయి. ప్రపంచ పె ట్టుబడిదారులకు నగరాన్ని స్వర్గధామంగా మారుస్తున్నాయి. హెచ్ఎండీఏ భూముల వేలంలో రికార్డుస్థాయిలో పలుకుతున్న ధర లు ఇందుకు నిదర్శనం. భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి రూ. 3,600 కోట్లకుపైగా ఆదాయం రావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. హెచ్ఎండీఏ ఈ నెల 3వ తేదీ నుంచి పదో తేదీ వరకు నాలుగు చోట్ల భూములకు వేలం నిర్వహించింది. 3న కోకాపేటలోని నియోపొలిస్లో 43 ఎకరాలకు నిర్వహించిన వేలం రియల్ ఎస్టేట్ రంగంలోనే మైలురాయిగా నిలిచింది. ఎకరానికి ఏకంగా గరిష్ఠంగా రూ. 100 కోట్లుపైనే పలికి రికార్డు సృష్టించింది. కనిష్ఠంగా రూ. 67.25 కోట్లు పలికింది. ఏడో తేదీన మోకిలలో 300 చదరపు గజాల విస్తీర్ణంలోని 50 ప్లాట్లు అంటే సుమారు 15వేల గజాల మేర భూములకు వేలం నిర్వహించగా గజానికి గరిష్ఠంగా రూ. 1.05 లక్షలు, కనిష్ఠంగా రూ. 72 వేలతో గజానికి సగటున రూ. 80 వే ధర పలికింది. తద్వారా హెచ్ఎండీఏకు రూ.121 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ నెల 8న షాబాద్లో 300 చదరపు గజాల విస్తీర్ణంలోని 50 ప్లాట్లకు ఈ-వేలం నిర్వహించగా, నిర్దేశిత ధర గజానికి రూ.10 వేలు ఉంటే గరిష్ఠంగా రూ.27వేలు, కనిష్ఠంగా రూ.18వేలతో రూ.33 కోట్ల ఆదాయం వచ్చింది. 10న బుద్వేల్లోని 100.01 ఎకరాలకు నిర్వహించిన వేలంలోనూ భారీ డిమాండ్ కనిపించింది.
20 నిమిషాల్లో ఎక్కడికైనా..
ఐటీ కారిడార్లో అత్యంత కీలకమైన కోకాపేటకు సమీపంలో ఉన్న మోకిలలో హెచ్ఎండీఏ భారీ లేఅవుట్ను అభివృద్ధి చేస్తున్నది. మోకిల నుంచి 20 నిమిషాల్లో కోకాపేట నియోపొలిస్ లేఅవుట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, గండిపేట పార్కు, సీబీఐటీ, ఓషియన్ పార్కు వంటి ప్రాంతాలను చేరుకోవచ్చు. ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా పనిచేస్తున్న హెచ్ఎండీఏ మాస్టర్ప్లాన్కు అనుగుణంగా లేఅవుట్లు, రోడ్లు నిర్మిస్తున్నది. గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగురోడ్డును దాటి శివారు ప్రాంతాల్లో పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో మెరుగైన మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించింది. కొత్తగా రోడ్ల నిర్మాణంతోపాటు అవసరమైన ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపడుతున్నారు. పచ్చదనం పెంపొందించేందుకు అటవీ ప్రాంతాలను అర్బన్ ఫారెస్ట్ బ్లాకులుగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.