నిజామాబాద్ : భారత రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు ప్రజలకు న్యాయ సహాయాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ బుయాన్ స్పష్టం చేశారు. న్యాయ సేవా అధికార సంస్థ ఏర్పడిన నాటి నుంచి అనేక విప్లవత్మమైన నిర్ణయాలు అమలు చేస్తూ సామాన్య ప్రజలకు చేరువ అవుతున్నదని తెలిపారు.
నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో న్యాయ సేవ అధికార సంస్థ, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కృత్రిమ అవయవాల ప్రధానోత్సవం కార్యక్రమానికి హాజరైన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ బుయాన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
శరీరంలో అవయవాలు లేక ఇబ్బందులు పడుతున్న 150 మంది అభాగ్యులకు కృత్రిమ పరికరాలను ప్రధాన న్యాయమూర్తి అందించారు. రొటరీ క్లబ్ చేస్తున్న సేవలు గొప్పగా ఉన్నాయని ప్రశంసించారు.
మానవ కోణంలో అభాగ్యులకు అండగా నిలిచిన ప్రతినిధులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు నవీన్ రావ్, శ్రీ సుధ, జిల్లా జడ్జి సునీత కుంచాల, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు.