ఖిలావరంగల్, ఏప్రిల్ 4: టెక్స్టైల్ పార్కు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో జాప్యం చేయడంతోపాటు కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని వరంగల్ ఆర్డీవో కార్యాలయంలోని ఆస్తులను జప్తు చేశారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేటకు చెందిన సముద్రాల స్వామి, ఆయన కూతురు వెన్నెలకు సంబంధించిన 20 ఎకరాల భూమిని ప్రభుత్వ టెక్స్టైల్ పార్కు కోసం తీసుకున్నారు. ఎకరానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పి భూమిలో రోడ్లు వేశారు. అయితే.. నష్టపరిహారం తక్కువగా వస్తుందని పలు మార్లు జిల్లా ఉన్నతాధికారులను ఆశ్రయిస్తే అప్పీల్కు వెళ్లాలని సూచించారు.
దీంతో బాధితులు హైదరాబాద్లోని ల్యాండ్ అక్విజేషన్ అథారిటీని ఆశ్రయించడంతో.. వరంగల్ భూ నిర్వాసితులకు రూ.2.40 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం, ఆర్డీవోకు ఉత్తర్వులు జారీ చేసింది. డబ్బులు చెల్లించకుండా ఆసల్యం చేస్తుండటంతో బాధితులు ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేశారు. అయినా డబ్బులు చెల్లించకుండా జాప్యం చేయడంతోపాటు తమ ఉత్తర్వులను అమలు చేయలేదని భావించిన కోర్టు.. వరంగల్ ఆర్డీవో కార్యాలయం ఆస్తులు జప్తు చేయాలని ఆదేశించింది. దీంతో గురువారం కోర్టు నుంచి వచ్చిన అధికారులు, సిబ్బంది ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని అక్కడ కోర్టు ఆర్డర్ను అంటించారు. అనంతరం కంప్యూటర్లు, ప్రింటర్లు, ఏసీలు, కూలర్లు, ఆర్డీవో వాహనంతోపాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.