మతిలేని మనుషులు ఏమంటేనేం..
మన ప్రగతి సంగతి ఆర్బీఐనే పట్టి చెప్పింది.
సిగ్గులేని నోర్లు ఏం ఒర్లితేనేం..
సిసలు సంగతిరిజర్వ్ బ్యాంక్ నివేదికే నిగ్గుతేల్చింది..
దేశాన్ని సాకుతున్ననాలుగైదు రాష్ర్టాల్లోతెలంగాణ ఒకటని..
ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నమాట నిక్కమై, సత్యమై నిలిచి గెలిచింది!
ఆరేండ్లలో తెలంగాణ ఏం సాధించిందో.. దేశ సెంట్రల్ బ్యాంక్ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ విస్పష్టంగా విప్పి చెప్పింది.. ప్రగతి పథంలో రాష్ట్రం పరుగులు తీస్తున్నదని, దేశ ఆర్థికానికి ఆయువుపట్టుగా.. ఆలంబనగా నిలుస్తున్నదని నిగ్గుతేల్చింది. జనాభా పరంగా, విస్తీర్ణం పరంగా, వనరుల పరంగా అగ్రస్థానంలో ఉన్న అనేక పెద్ద రాష్ర్టాలను తోసిరాజని, దేశానికి రాష్ట్ర నికర విలువ జోడింపులో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచిందని ఆర్బీఐ వెల్లడించింది. రాష్ట్ర తలసరి నికర దేశీయోత్పత్తిలోనూ, తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ నాలుగోస్థానంలో ఉన్నదని ప్రకటించింది. కండ్లున్న కబోదులు ఎవరేమంటేనేం.. ఇది వాస్తవంఎవరేం మొరిగేతేనేం.. ఇదే వాస్తవం
ప్రాంతాభివృద్ధిపై దూరదృష్టి..
ప్రజలపై ప్రేమతో కూడిన పట్టుదల..
క్రమశిక్షణతో పనిచేసే నాయకత్వం..
పరిపాలనా విధానాల్లో దృఢ వైఖరి..
అన్నింటి సమాహారం
కేసీఆర్ విజన్.. కేసీఆర్ ఇజం
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): దేశ ఆర్థిక రంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందని భారత రిజర్వ్బ్యాంకు కొనియాడింది. దేశ ఆర్థిక వృద్ధికి దన్నుగా నిలుస్తున్న అగ్రశ్రేణి రాష్ట్రంగా తెలంగాణపై ప్రశంసల వర్షం కురిపించింది. తెలంగాణ వస్తే ఏం ఒరుగుతుందన్నవాళ్లకు.. ఏమీ సాధించలేరన్న వాళ్లకు ఆర్బీఐ తాజా గణాంకాలే గట్టి గుణపాఠం చెప్పాయి. దేశాన్ని సాకుతున్న నాలుగైదు రాష్ర్టాల్లో ఒకటన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మాటలను ఆర్బీఐ అక్షరాలా నిజంచేసి నివేదించింది. దేశ ఆర్థిక వ్యవస్థలో మన వాటా ఏమిటో.. ఎంతో.. కచ్చితంగా లెక్కగట్టి నాలుగో స్థానంలో ఉన్నట్టు తేల్చి చెప్పింది. ‘హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ ఎకానమీ-2021’లో ఈ సంగతి స్పష్టం చేసింది. దేశ సంపదకు మన జోడింపు రూ.8.10 లక్షల కోట్లుగా తేల్చింది. స్వరాష్ట్రం ఏర్పడిననాడు అంటే 2014-15లో మనం దేశానికి సమకూర్చే సంపద రూ.4.16 లక్షల కోట్లు మాత్రమే. కేవలం ఆరేండ్లలో అది రెట్టింపు కావడం కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో వేసిన అంగలకు అద్దం పడుతుంది. ఇందులో స్థూల విలువ 94%, నికర వి లువ 95% పెరిగాయి. చాలా పెద్దవి, ఎక్కువ జనాభా కలిగినవి, పాతవి అయిన తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలు మాత్ర మే దేశానికి సంపద సమకూర్చి పెట్టడంలో తెలంగాణ కంటే ముందు స్థానాల్లో ఉన్నాయి.
అంతేకాకుండా, దేశానికి సమకూర్చిన తలసరి ఉత్పాదనలోనూ తెలంగాణ నాలుగో స్థానంలో నిలించింది. రాష్ట్ర తలసరి ఎన్ఎస్డీపీ రూ.2.37 లక్షలుగా నమోదైంది. పెద్ద రాష్ర్టాల్లో ఇదే అత్యధికం. జాతీయ నికర తలసరి ఆదాయం (రూ.1.28 లక్షలు) కంటే తెలంగాణ ఎన్ఎస్డీపీ దాదాపు రెట్టింపు ఉండటం గమనార్హం. ఈ జాబితాలో సిక్కిం (రూ.4.24 లక్షలు), ఢిల్లీ (రూ.3.54 లక్షలు), హర్యానా (రూ.2.39 లక్షలు) లాంటి చిన్న రాష్ట్రాలు మాత్రమే తెలంగాణ కంటే ముందున్నాయి. దేశంలో జనాభాపరంగా మన రాష్ట్రం 11వ స్థానంలో, భౌగోళిక విస్తీర్ణం పరంగా 12వ స్థానంలో కొనసాగుతున్నప్పటికీ దేశ ఆర్థికవ్యవస్థకు చేయూతనివ్వడంలో మాత్రం 4వ స్థానంలో నిలువడం విశేషం.
దేశం దిమ్మతిరిగిపోయేలా సాధించిన ఈ వృద్ధిలో వ్యవసాయం రంగం కీలకపాత్ర పోషించినట్టు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. ఇది దండగన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చిన సర్కారు విధానాలకు తిరుగులేని కితాబుగా నిలుస్తుంది. 2020-21లో వ్యవసాయం, అటవీ, మత్స్య పరిశ్రమ ఎన్ఎస్వీఏ రూ.1.76 లక్షల కోట్లుగా నమోదైంది. మైనింగ్, క్వారీ, మాన్యుఫ్యాక్చరింగ్, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, నిర్మాణం.. ఇలా అన్ని రంగాల్లోనూ తెలంగాణ మెరుగైన వృద్ధి కనబరించింది.