హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్లైన్లో ఉచ్చులోపడి చాలా మంది అమాయకులు కష్టపడి సాధించిన సొత్తును పోగొట్టుకుంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, నిపుణులు హెచ్చరిస్తున్నా.. నేరగాళ్ల బారినపడుతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్లోని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేస్తున్న ఓ మహిళా అధికారి సైతం సైబర్ నేరగాళ్ల బారినపడినపడ్డారు.
ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.లక్ష వరకు నేరగాళ్లు లూటీ చేశారు. ఆ తర్వాత విషయాన్ని తెలుసుకున్న ఉద్యోగి పోలీసులను ఆశ్రయించగా.. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం బాధితురాలికి గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.
ఆమె సిమ్కార్డ్ వివరాలను తెలుసుకొని, అక్టోబర్ చివరి నాటికి గడువు పూర్తవుతుందని సదరు వ్యక్తి చెప్పాడు. తను చెప్పినట్లు చేస్తే గడువును పెంచుకోవచ్చని నమ్మబలికాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి బ్యాంకు ఖాతా వివరాలను సైతం తెలిపింది. ఆ తర్వాత ఫోన్ కట్ చేసిన వెంటనే ఫోన్కు ఎస్ఎంఎస్లు వచ్చాయి. రెండుసార్లు బ్యాంకు ఖాతా నుంచి రూ.లక్ష వరకు డెబిట్ అయ్యాయి. వెంటనే మోసపోయానని తెలుసుకున్న ఆమె పోలీసులను ఆశ్రయించింది.