హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న శాఖల్లో ఆర్అండ్బీ కూడా చేరింది. వందలకోట్ల రూపాయల బిల్లులు పెండింగులో ఉండడంతో పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. నిధుల లేమితో ప్యాచ్వర్క్లు సైతం మూలుగుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాత ఆర్అండ్బీ సర్కిళ్ల పరిధిలో 6,641 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులకు గత కేసీఆర్ ప్రభుత్వం రూ. 2,500 కోట్లు మంజూరు చేసింది. రోడ్ల మరమ్మతులకు రూ.1,823కోట్లు, కల్వర్టుల రిపేరు కోసం రూ.544 కోట్లు కలిపి రూ. 2,367 కోట్ల అంచనాతో అధికారులు పనులు మొదలుపెట్టారు. మొత్తం 1,170 మరమ్మతు పనులను మంజూరు చేయగా వాటిలో 591 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో 450 పురోగతిలో ఉన్నాయి. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో 129 పనులు పెండింగులో ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు రూ.1200 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత ఎన్నికల హడావుడి కారణంగా బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. అనంతరం ఏర్పడిన కొత్త ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు పెండింగ్ బిల్లుల మాటెత్తకపోవడంతో పనులు నిలిచిపోయాయి.
వరదలకు తీవ్రంగా ప్రభావితమైన కరీంనగర్లో అత్యధికంగా 174 పనులు చేపట్టగా, వరంగల్లో 162, నల్లగొండలో 138, ఖమ్మంలో 134 పనులు చేపట్టారు. ఈ నాలుగు జిల్లాల్లో 60 శాతం, సంగారెడ్డి, మహబూబ్నగర్, ఆదిలాబాద్, రూరల్ రీజియన్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో 35 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. మొత్తంగా చూస్తే సగటున 50 శాతం పనులు పూర్తయ్యాయి. మరమ్మతు పనులను జనవరి చివరి నాటికి పూర్తిచేయాలని భావించినప్పటికీ పెండింగ్ బిల్లులు రాక నిలిచిపోవడంతో పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తున్నది. మరోవైపు, ప్యాచ్వర్క్ల కోసం రూ. 70 కోట్ల వరకు ఖర్చవుతుందని ఆర్అండ్బీ అధికారులు అంచనా వేసి పనులు ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాలేదు. ఈ నేపథ్యంలో ప్యాచ్వర్క్ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.