నల్లగొండ : గురుకులాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్(Ravindra Kumar) ఆరోపించారు. దేవరకొండ మైనార్టీ గురుకుల పాఠశాలలో(Devarakonda Minority Gurukula School) నిన్న ముగ్గురు విద్యార్థులు తప్పిపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలను సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గురుకుల పాఠశాలలు అధ్వానంగా మారుతున్నాయి. కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని మండి పడ్డారు. గురుకులాల అధ్వాన పరిస్థితికి, విద్యార్థుల మరణాలకు విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డినే బాధ్యుడన్నారు. మీ పాలన ఎట్లుందో చెప్పడానికి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న గురు కులాలే నిదర్శనం అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో వెలుగొందిన గురుకులాలు మీ అసమర్థత కారణంగా మసకబారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల మీద నోరు పారేసుకోవడం మానేసి ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు. మొద్దు నిద్రను వీడి గురుకులాల్లో విద్య, భోజనం, వసతులు కల్పించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ముగ్గురు విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చి తల్లితండ్రులకు అప్పగించాలన్నారు.