హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల నుంచి రైతులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా గురువారం సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ధాన్యం విక్రయించిన పెంటయ్యకు అక్కడికక్కడే స్వయంగా ధాన్యం విక్రయపత్రాన్ని అందజేశారు. దీనిపై స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా రవీందర్సింగ్ వివిధ జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతూ వస్తున్నారు. రైతుల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే ఎంతదూరమైనా సరే వెళ్లి సమస్యలను పరిష్కరిస్తున్నారు. అక్కడి అధికారులు, మిల్లర్లకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు.