హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : ఉషా ముళ్లపూడి కార్డియాక్ సెంటర్ మేనేజింగ్ ట్రస్టీ, ప్రముఖ గుండె వ్యాధి నిపుణుడు డాక్టర్ రత్నం వీ ముళ్లపూడి (88) సోమవారం ఉదయం 8.30 గంటలకు కన్నుమూశారు. వయస్సు సంబంధిత రుగ్మతలతో ఆయన మృతి చెందినట్టు ఉషా ముళ్లపూడి దవాఖాన ఒక ప్రకటనలో వెల్లడించింది. డాక్టర్ రత్నంకు భార్య డాక్టర్ నలిని ముళ్లపూడి, కుమార్తె జ్యోతి ముళ్లపూడి ఉన్నారు.
అమెరికాలో ఎంతో విజయవంతమైన గుండె వ్యాధి నిపుణుగా పేరుపొందిన డాక్టర్ రత్నం తన సతీమణితో కలిసి మాతృదేశానికి సేవలందించేందుకు భారత్కు తిరిగి వచ్చారు. ప్రభుత్వ సహకారంతో ఆయన 1998లో లాభాపేక్ష లేని, చారిటబుల్ ట్రస్ట్ దవాఖానగా ‘ఉషా ముళ్లపూడి కార్డియాక్ సెంటర్’ను స్థాపించారు. నామమాత్రపు ఫీజు తీసుకొని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆయన ఎంతోమంది పేదలకు వైద్యసేవలందించారు. సుమారు 20వేలకుపైగా గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడి వైద్య నిపుణులకు ఆదర్శంగా నిలిచారు.