మెదక్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా సామ్రాజ్యం రోజురోజుకు విస్తరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు మాఫియా సభ్యులు తక్కువ ధరకు కొనుగోలు చేసి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు సమాచారం. రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు సేకరించి, అధిక ధరలకు విక్రయించడం ద్వారా వ్యాపారులు భారీ లాభాలు ఆర్జిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ అక్రమ వ్యాపారానికి రైస్ మిల్లు వ్యాపారులే ప్రధాన సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
మరోవైపు పౌరసరఫరాలు, రెవెన్యూ, పోలీస్, టాస్క్ఫోర్స్ శాఖల కొందరు అధికారులకు ప్రతినెల మామూలు చెల్లిస్తూ మాఫియా వ్యాపారం నిరభ్యంతరంగా కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, పాపన్నపేట్, హవేలీ ఘనాపూర్ తదితర మండలాల్లో రేషన్ బియ్యాన్ని గుట్టుగా నిల్వచేసి, తరువాత ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు సమాచారం.
పక్క రాష్ట్రాలకు అక్రమ రవాణా..?
పేదలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు డీలర్లు, మధ్యవర్తులు తక్కువ ధరలకు కొనుగోలు చేసి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. పేదల నుంచి సేకరించిన బియ్యాన్ని గ్రామాల పరిసరాల్లోని షెడ్డులు, వ్యవసాయ క్షేత్రాల్లో నిల్వ చేసి, అనంతరం లారీలు, డీసీఎంల ద్వారా తరలిస్తున్నట్టు సమాచారం.
మెదక్ జిల్లాలో సేకరించిన బియ్యాన్ని ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు తెలిసింది. పేదల బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నా సంబంధిత అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల అండదండలు ఉండటంతో మాఫియా నిర్భయంగా వ్యవహరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వేలం పత్రాలే అనుమతులుగా
అధికారులు దాడులు చేసి పట్టుకున్న రేషన్ బియ్యాన్ని కొంతకాలం తర్వాత సివిల్ సప్లై శాఖ అధికారులు బహిరంగ వేలంలో విక్రయిస్తారు. ఈ వేలంలో అదే మాఫియా వర్గాలు బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వేలంలో కొనుగోలు చేసిన సమయంలో ఇచ్చే అనుమతి పత్రాన్ని అడ్డుపెట్టుకుని, అదే పత్రంతో నెలల తరబడి అక్రమంగా రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు సమాచారం.
వేలంలో కొనుగోలు చేసిన బియ్యాన్ని గోదాం నుంచి తరలించడానికి మాత్రమే ఇచ్చే పత్రాలు, మాఫియా చేతుల్లో అక్రమ రవాణాకు మార్గంగా మారిపోయాయని స్థానికులు అంటున్నారు. ఈ విధంగా లారీలు, డీసీఎంలలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక ఉన్న ముఠాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న బియ్యం ఇలా పక్కదారి పడకుండా సంబంధిత అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు.