Telangana | హైదరాబాద్ : రేషన్ డీలర్లకు సంబంధించిన మరో సమస్యను తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించింది. ఎవరైనా డీలర్ మృతి చెందితే కారుణ్య నియామకం ద్వారా అతని కుటుంబ సభ్యుల్లో ఒకరికి డీలర్షిప్ ఇచ్చేందుకు వయస్సు పరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం 40 ఏళ్ల వరకు ఉన్నటువంటి వయసు పరిమితిని 50 ఏళ్లకు పెంచుతూ పౌరసరఫరాల శాఖ కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ఎవరైనా డీలర్ చనిపోతే ఆయన కుటుంబంలోని 50 ఏళ్ల వరకు వయస్సు గల వారికి ఆ డీలర్షిప్ను కేటాయిస్తారు. అయితే డీలర్షిప్ పొందే వ్యక్తికి కచ్చితంగా 18 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ నిబంధన నుంచి మినహాయింపు కోరే అవకాశం ఉంది. డీలర్ మరణించిన తర్వాత రెండేళ్లకు ఈ నిబంధనతో సంబంధం లేకుండా డీలర్షిప్ కేటాయిస్తారు. అయితే డీలర్ మరణించిన వెంటనే సదరు అర్హత వ్యక్తి డీలర్షిప్ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.