భద్రాచలం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలో శ్రీసీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుము ఆలయం వద్ద రాష్ట్రపతికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో అర్చకులు వేదాశీర్వచనం అందిచారు. శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఆతర్వాత భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ‘ప్రసాద్’ పథకం శిలాఫకాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఆమెవెంట గవర్నర్ తమిళిసై, మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ ఉన్నారు.
అనంతరం సమ్మక్క-సారలమ్మ పూజారి సమ్మేళనంలో రాష్ట్రపతి పాల్గొంటారు. తర్వాత వర్చువల్ విధానంలో కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లోని ఏకలవ్య పాఠశాలలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.35 గంటలకు ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి బయల్దేరుతారు.