ఇల్లంతకుంట, మే 28 : రాష్ట్రంలో కాంగ్రెస్ది చేతగాని పాలన నడుస్తున్నదని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. పంట కొనుగోలు రాష్ట్ర సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు.
వానకాలం వచ్చినా కేంద్రాల్లోనే ధాన్యం కుప్పలు కుప్పలుగా ఉన్నాయని వాపోయారు. మానకొండూర్ ఎమ్మెల్యే చేతగానితనం వల్ల లారీలు రాని పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. కాంగ్రెస్కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇప్పటికైనా ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో ధాన్యం కొనకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
పెద్దపల్లి కమాన్, మే 28: అసమర్థ కాంగ్రెస్ పాలనతో రైతులు అష్టకష్టాలు పడే దౌర్భాగ్యం నెలకొన్నదని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డును ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన వరి ధాన్యం, మక్కలు, తూకం వేస్తున్న వరి ధాన్యాన్ని పరిశీలించి, రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

పలువురు రైతులు, మహిళలు తమ గోడు వెల్లబోసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మార్కెట్లో ధాన్యం కుప్పలు పోసి నెలన్నర కావస్తున్నా 50 శాతం మేరకే జరిగాయని, ఓ వైపు వానకాలం సమీపిస్తుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.