బేగంపేట్ డిసెంబర్ 3: ఆ దంపతులకు ఐవీఎఫ్ విధానంలో కవలలు పుట్టారు. కానీ ఇద్దరు పిల్లలు కలిగారన్న ఆనందం ఆ దంపతులకు ఎంతోసేపు నిలవలేదు. నెలలు నిండకముందే పుట్టడంతో ఒకరు 900 గ్రాములు, మరొకరు 800 గ్రాముల బరువు మాత్రమే ఉన్నారు. పుట్టిన 12 గంటల తరువాత ఒకరిలో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తి కొద్దిసేపట్లోనే కన్ను మూశాడు. రెండో శిశువు కూడా ఊపిరి సరిగ్గా అందక సతమతమయ్యాడు. ఇన్ఫెక్షన్ కారణంగా మూత్రపిండాల సమస్య వచ్చింది. దీంతో వెంటనే ఆ శిశివును సికింద్రాబాద్లోని కిమ్స్ దవాఖానకు తీసుకొచ్చారు. వైద్యులు ఆ చిన్నారిని పరీక్షించి పీడీఏ అనే హృద్రోగ సమస్య ఉన్నట్టు తేల్చారు. దీనివల్ల గుండెలో రంధ్రం ఏర్పడుతుంది. ఫలితంగా గుండెకు, ఊపిరితిత్తులకు రక్త సరఫరా పెరిగిపోయి గుండె పనితీరు ప్రభావితమవుతుంది. ఒక్కోసారి మూత్ర పిండాలు కూడా దెబ్బతిని మెదడులో అంతర్గత రక్తస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. శస్త్ర చికిత్స లేకుండా ఆత్యాధునిక పరిజ్ఞానంతో ఈ సమస్యను పరిష్కరించాలని కిమ్స్ వైద్య బృందం నిర్ణయించింది.
పికోలో ఆక్లూడర్ అనే ఆత్యాధునిక పరికరాన్ని అమర్చాలని వైద్యులు నిర్ణయించారు. వెంటనే కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్లు డాక్టర్ సుదీప్వర్మ, గౌతమి, కన్సల్టెంట్ పీడియాట్రిక్ అనెస్థీషియాలజిస్ట్ డాక్టర్ నాగరాజన్ బృందం రంగంలోకి దిగింది. సాధారణ నాణెంలో పదో వంతు మాత్రమే ఉండే పికోలో ఆక్లూడర్ అనే మెష్లాంటి పరికరాన్ని శిశువు గుండెల్లో అమర్చారు. సాధారణంగా శస్త్ర చికిత్స చేసి దీన్ని అమరుస్తారు. కానీ కిమ్స్లో ఉన్న ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో శస్త్ర చికిత్స అవసరం లేకుండానే చిన్న కోతతో పనిపూర్తిచేశారు. లోపలకు వెళ్లిన తర్వాత ఈ ఆక్లూడర్ తెరచుకొని గుండెలో రంధ్రాన్ని పూర్తిగా మూసేస్తుందని వారు తెలిపారు. పూర్తిగా నెలలు నిండకుండా, తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు శస్త్ర చికిత్స లేకుండా ఇటువంటి పరికరాలను అమర్చడం దేశంలోనే అత్యంత అరుదైన ఘటనగా వారు పేర్కొన్నారు. శిశువుకు 14 రోజుల వయస్సులో ఆ పరికరాన్ని అమర్చారు. ఆ తరువాత 45 రోజులపాటు వైద్యులు ఆ బాబును తమ పర్యవేక్షణలో ఉంచుకున్నారు. శిశువుకు 60 రోజుల వయస్సు, 1.5 కిలోల బరువు వచ్చిన తరువాత డిశ్చార్జి చేశామని తెలిపారు.