కీసర ( మేడ్చల్ ) : పట్టాలను అభివృద్ధి చేసిన మాదిరిగానే పల్లెలు సైతం అభివృద్ది చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mallareddy) తెలిపారు. కీసర మండలంలోని అంకిరెడ్డిపల్లి, కీసరదాయర, వన్నిగూడ, భోగారం, కీసర తదితర గ్రామాల్లో మంగళవారం పాదయాత్ర నిర్వహించి స్థానిక సమస్యలపై మాట్లాడారు.
పల్లెల్లో (Villages) మౌలిక సదుపాయాలు గణనీయంగా పెరిగాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) గ్రామాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. రోడ్లు, ఇంటింటికి భగీరథ (Mission Baghiratha) నీరు, వైకుంఠదామాల నిర్మాణం, హరితహారం ద్వారా చెట్ల పెంపకం తదితర సదుపాయాలను కల్పించిన ఘనత ప్రభుత్వానికే దక్కిందని కొనియాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కో గ్రామంలో కోట్లాది రూపాయలతో పనులు జరిగాయని అన్నారు.
పాఠశాలల అభివృద్ధి, వైద్యుల నియమకం, రవాణా వ్యవస్తను అందుబాటులోకి తీసుకురావడం, నిరంతర విద్యుత్, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపట్టామని వివరించారు. కార్యక్రమంలో మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ జె.సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.