హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఎంసెట్లో 85.7 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. టాప్ పది ర్యాంకుల్లో అత్యధికం బాలురు కైవసం చేసుకున్నారు. ఇంజినీరింగ్ టాప్ -10 ర్యాంకుల్లో 9 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో 8 మంది నిలిచారు. మరోవైపు, ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ రెండింట్లో బాలురతో పోల్చితే బాలికలే అధిక శాతం అర్హత సాధించడం గమనార్హం. ఇంజినీరింగ్లో బాలికలు 83.76 శాతం మంది, బాలురు 81.07 శాతం మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్, మెడికల్లో బాలికలు 93.11 శాతం అర్హతసాధిస్తే.. బాలురు 91.16 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్, 9, 10 తేదీల్లో వ్యవసాయం, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ నిర్వహించగా.. ఆయా ఫలితాలను బుధవారం కూకట్పల్లిలోని జేఎన్టీయూలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదలచేశారు. రెండు విభాగాల్లోనూ టాప్ ర్యాంకులను అబ్బాయిలే సొంతం చేసుకున్నారు. ఇంజినీరింగ్లో టాప్-3 ర్యాంకులు అబ్బాయిలు దక్కించుకోగా.. అగ్రికల్చర్, మెడికల్లో టాప్ -3లో ఇద్దరు బాలురే ఉన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, మాజీ చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, జేఎన్టీయూ వైస్చాన్స్లర్ కట్టా నర్సింహారెడ్డి, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్, కో కన్వీనర్ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
విద్యా ప్రణాళికల్లో తెలంగాణ ముందంజ: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ఇతర రాష్ట్రాలతో పోల్చితే విద్యా ప్రణాళికలో తెలంగాణ ముందంజలో ఉన్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కరోనాతో గత 17 మాసాలుగా విద్యారంగం తీవ్రంగా ప్రభావితమైందని ఆందోళన వ్యక్తంచేశారు. విద్యార్థులు నష్టపోకుండా చర్యలు చేపట్టామని, ప్రవేశ పరీక్షల నిర్వహణ సహా విద్యా ప్రణాళికలను రూపొందించి, అమలుచేయడంలో తెలంగాణ అన్ని రాష్ట్రాలకంటే ముందుందని చెప్పారు. కరోనా క్లిష్ట సమయంలోనూ ఇబ్బందులు రాకుండా ప్రవేశ పరీక్షలను నిర్వహించడంపై అధికారులను అభినందించారు. ప్రణాళికాబద్ధంగా, సమన్వయంతో పనిచేయడం వల్లే ఇది సాధ్యపడిందని పేర్కొన్నారు. ర్యాంకులు పొందిన విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవాలని ఆమె ఆకాంక్షించారు.
30 నుంచి కౌన్సెలింగ్.. 15న సీట్ల కేటాయింపు
ఈ నెల 30 నుంచి వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభంకానున్నది. సెప్టెంబర్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనుండగా వెబ్ ఆప్షన్ల ఎంపిక పూర్తయ్యాక.. వచ్చేనెల 15న విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నారు.
షెడ్యూల్ ఇలా..
ఆన్లైన్లో విద్యార్థి వివరాల నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్బుకింగ్ : 30-8-21 నుంచి 9-9-21
సర్టిఫికెట్ వెరిఫికేషన్ : 4-9-21 నుంచి 11-9-21
వెబ్ ఆప్షన్లు : 4-9-21 నుంచి 13-9-21
వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ : 13-9-21
సీట్ల కేటాయింపు: 15-9-21
ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ : 15-9-21 నుంచి 20-9- 21
ర్యాంకు పేరు (మార్కులు) స్వస్థలం
1 సత్తి కార్తికేయ (158.49) పాలకొల్లు ప.గో (ఏపీ)
2 దుగ్గినేని వెంకట పనీశ్(156.58) రాజంపేట, కడప
3 మహ్మద్ అబ్దుల్ ముఖీత్(156.45) టోలిచౌకి, హైదరాబాద్
4 రామస్వామి సంతోష్రెడ్డి (154.75) భూదాన్ పోచంపల్లి, నల్లగొండ
5 జ్యోసుల వెంకట ఆదిత్య ( 154.74) హైదర్నగర్, హైదరాబాద్
6 పోతంశెట్టి చేతన్ మనోజ్ఞ (154.67) పీలేరు, చిత్తూరు (ఏపీ)
7 మిడతన ప్రణయ్ (153.30) విజయనగరం (ఏపీ)
8 దేశాయి సాయిప్రణవ్ (152.69) నెల్లూరు (ఏపీ)
9 సవరం దివాకర్సాయి (152.69) విజయనగరం (ఏపీ)
10 సోమిడి సాత్వికరెడ్డి (152.13) నల్లగొండ
ర్యాంకు పేరు (మార్కులు) స్వస్థలం
1 మండవ కార్తికేయ (151.99) బాలానగర్,హైదరాబాద్
2 ఈమని శ్రీనిజ (150.30) పెద్ద అంబర్పేట,రంగారెడ్డి
3 తీరుపల్లి సాయి కౌశల్రెడ్డి (150.12) కూకట్పల్లి,రంగారెడ్డి
4 రంగు శ్రీనివాస కార్తికేయ (150.04) అనంతపూర్ (ఏపీ)
5 చందం విష్ణు వివేక్ ( 149.71) రాజమండ్రి (ఏపీ)
6 కోల పవన్రాజ్ (149.63) కాకినాడ (ఏపీ)
7 కన్నెకంటి లాస్య చౌదరి (149.20) వైరా, ఖమ్మం
8 పల్లి వెంకట కౌశిక్రెడ్డి (148.83) ఎంజీరోడ్, విజయవాడ (ఏపీ)
9 రవి అభిరామ్ (148.23) లింగపల్లి, రంగారెడ్డి
10 బండగొర్ల రామకృష్ణ (148.07) శాలిగౌరారం, నల్లగొండ
ఐఐటీ-బాంబేలో సీఎస్ నా కోరిక
జేఈఈ అడ్వాన్స్డ్లో మంచి ర్యాంకు సాధించి ఐఐటీ-బాంబేలో కంప్యూటర్ సైన్స్ కోర్సు చేయాలనేది నా కోరిక. అందుకు తగ్గట్టే చదువుతున్నా. జేఈఈ మెయిన్స్లో 99.99 పర్సంటైల్ సాధించాను. ఒకవేళ ఐఐటీ బాంబేలో సీటు రాకపోతే బెంగళూరులోని ఐఐఎస్సీలో చేరి.. పరిశోధనపై దృష్టి పెడతా.
– సత్తి కార్తికేయ, 1వ ర్యాంకర్, ఇంజినీరింగ్
అడ్వాన్స్డ్లోనూ మంచి ర్యాంకు సాధిస్తా
ఐఐటీ బాంబేలో సీటు సాధించడమే నా లక్ష్యం. కరోనా రావడం, కాలేజీలు మూతపడి కొంత ఇబ్బంది పడ్డాను. అయినా ధైర్యం కోల్పోలేదు. లెక్చరర్లు మాకు ధైర్యం చెప్పి.. లాక్డౌన్లో ఆన్లైన్ క్లాసుల ద్వారా చదివించారు. అందుకే జేఈఈ మెయిన్స్లో 100 పర్సంటైల్ సాధించాను. ఇప్పుడు తెలంగాణ ఎంసెట్లో రెండో ర్యాంకు సాధించా. అడ్వాన్స్డ్లోనూ మంచి ర్యాంకు సాధిస్తాననే నమ్మకం ఉన్నది.
– వెంకట పనీశ్, 2వ ర్యాంకు, ఇంజినీరింగ్
ఐఐటీలో సీటే టార్గెట్
టాప్ ఐఐటీల్లో సీటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. జేఈఈ మెయిన్స్లో 99.97 పర్సంటైల్ సాధించాను. ఇప్పటికే బిట్శాట్లో మంచి ర్యాంకు వచ్చింది. జేఈఈ అడ్వాన్స్డ్లో మంచి ర్యాంకు సాధించి ఐఐటీలో చేరుతాను.
– మహమ్మద్ అబ్దుల్ ముఖీత్,
3వ ర్యాంకు, ఇంజినీరింగ్
సాఫ్ట్వేర్పై ఆసక్తి
మా నాన్న సాఫ్ట్వేర్ ఉద్యో గి. నాక్కూడా సాఫ్ట్వేర్ రంగం పై ఆసక్తి పెరిగింది. అందుకే ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నా.
– వెంకట ఆదిత్య, 5వ ర్యాంకు, ఇంజినీరింగ్
ఢిల్లీ ఎయిమ్స్లో సీటే లక్ష్యం
డాక్టర్ కావాలనేది నా కోరిక. నీట్లో మంచి ర్యాంకు సాధించి ఢిల్లీ ఎయిమ్స్లో సీటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఎందులో స్పెషలైజేషన్ చేయాలనేది తర్వాత నిర్ణయించుకుంటా. – కార్తికేయ, 1వ ర్యాంకు
10 గంటలు చదువుతున్నా
కరోనాతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా. వాటిని అధిగమించేందుకు అనుకున్నదానికంటే ఎక్కువ సమయం చదువుకు కేటాయిస్తున్నా. ప్రతిరోజు కనీసం 10 గంటలు చదువుతున్నాను. అడ్వాన్స్డ్లో మంచి ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో సీటు సాధించాలనేది నా లక్ష్యం.
– ప్రణయ్, 7వ ర్యాంకు
నాన్న బాటలో..
మా నాన్న డాక్టర్.. ఆయన బాటలోనే నడవాలనుకున్నా. నీట్లో మంచి ర్యాంకు సాధించి ఢిల్లీ ఎయిమ్స్లో సీటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. నీట్కు ముందు రాసిన ఎంసెట్లో రెండో ర్యాంకు రావడం ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. – శ్రీనిజ, 2వ ర్యాంకు
డాక్టర్ కావాలని..
మా అమ్మ డాక్టర్. నేను కూడా డాక్టర్ కావాలని అనుకున్నా. నీట్లో ర్యాంకు సాధించి ఢిల్లీ ఎయిమ్స్లో సీటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఎంసెట్లో మంచి ర్యాంకు రావడం సంతోషంగా ఉన్నది.
– శ్రీనివాస కార్తికేయ, 4వ ర్యాంకు