EAMCET | హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించేందుకు ఎంసెట్ టాప్ ర్యాంకర్లు ఆసక్తి చూపడం లేదు. ఐఐటీ, ఎన్ఐటీల్లో చేరేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో వీరంతా ఇంజినీరింగ్ విద్యకోసం రాష్ట్రందాటి బయటికెళ్తున్నారు. ముఖ్యంగా వెయ్యిలోపు ర్యాంకర్లలో అత్యధికులు రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరేందుకు సుముఖంగా లేరు. వీరంతా ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకే మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ కౌన్సెలింగ్లో ఈ విషయం స్పష్టమైంది. ఎంసెట్ మొదటి విడత కౌన్సెలింగ్కు హాజరైన వారి వివరాలు పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్ ర్యాంకర్లల్లో 1 నుంచి 200 లోపు ర్యాంకర్లలో ఒక్కరు కూడా కౌన్సెలింగ్కు హాజరుకాలేదు. 300 లోపు వివరాలు తీసుకొంటే ఒక్కరే కౌన్సెలింగ్కు హాజరయ్యారు. 400 లోపు ర్యాంకర్లలో కేవలం ముగ్గురు, 500 లోపు 14 మంది మాత్రమే కౌన్సెలింగ్లో పాల్గొన్నారు. వెయ్యిలోపు ర్యాంకర్ల వివరాలను పరిశీలిస్తే 104 మాత్రమే రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు ఉత్సుకతను ప్రదర్శించారు.
కారణాలివే..
ఎంసెట్ ఇంజినీరింగ్ ఎగ్జామ్కు హాజరైన విద్యార్థుల్లో అత్యధికులు జేఈఈ ఎగ్జామ్కు హాజరవుతారు. సహజంగా ప్రతిభావంతులు కావడంతో వీరంతా ఎంసెట్యే కాకుండా జేఈఈలోనూ మంచి ర్యాంకులే సాధిస్తారు. అయితే వెయ్యిలోపు ర్యాంకర్లలోఎవరిని కదిలించినా ఐఐటీలు, ఎన్ఐటీలకు మొదటిప్రాధాన్యం ఇస్తారు. ఆ తర్వాతే రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీలను ఎంచుకొంటారు. ఈ తంతు కారణంగానే టాపర్లు మన రాష్ట్రంలో చేరడంలేదని, కౌన్సిలింగ్కు హాజరుకావడంలేదని అధికారులు పేర్కొంటున్నాయి. అయితే ఈ సారి ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విషయంలో అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఐఐటీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే జోసా కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత ఎంసెట్ కౌన్సెలింగ్ను ప్రారంభించారు. గతంలో ఎంసెట్ కౌన్సెలింగ్ ముందుగా జరగడంతో వీరంతా తొలుత రాష్ట్రంలో ప్రవేశాలు పొంది, తర్వాత ఐఐటీల్లో చేరేవారు. కానిప్పుడు ముందుగానే ఐఐటీల్లో చేరడంతో రాష్ట్రంలో కౌన్సెలింగ్కు హాజరుకాలేకపోయారు. దీంతో ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు విశ్లేషిస్తున్నారు.
యాజమాన్యాల అక్రమాలకు తెర
అత్యుత్తమ ర్యాంకర్లు ముందుగానే ఐఐటీల్లో ప్రవేశాలు పొందడంతో రాష్ట్రంలోని ప్రైవేట్ యాజమాన్యాలు స్పాట్ సెలెక్షన్ పేరుతో నిర్వహించే అక్రమాలకు తెరపడినట్టయింది. గతంలో ఎంసెట్ టాపర్లు రాష్ట్రంలో చేరినా.. వారు సీట్లు వదులుకొనేవారు. అయితే, కాలేజీల యాజమాన్యాలు సీట్లు వదులుకున్న విషయాన్ని చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచి ఆయా సీట్లను స్పాట్ సెలెక్షన్ సమయంలో ఖాళీగా ఉన్నట్టుగా చూపించి విక్రయించేవి. తాజాగా ప్రతిభావంతులు కౌన్సెలింగ్కు హాజరుకాకపోవడంతో, నిండినట్టుగా చూపించుకొనే అవకాశం లేకపోగా, స్పాట్ అక్రమాలకు అడ్డుకట్టపడినట్టయింది.
కన్వీనర్ కోటాలో 76వేల సీట్లు
ఈ ఏడాది ఇంజినీరింగ్లో కన్వీనర్ కోటా సీట్ల సంఖ్య 76,359కి చేరింది. తొలుత వీటి సంఖ్య 62 వేలు మాత్రమే ఉండేది. ఇటీవలే సీట్ల పెంపు, కొత్త కోర్సుల అనుమతి ఇవ్వగా, వీటి సంఖ్య పెరిగింది. కాలేజీలు తీసుకొంటే 16 యూనివర్సిటీ కాలేజీలు, 2 ప్రైవేట్ యూనివర్సిటీలు, 155 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో కన్వీనర్, మేనేజ్మెంట్ కోటా కలిపి మొత్తం సీట్లు 1,07,039 ఉన్నాయి. ఈ నెల 12 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశముండగా, ఇప్పటివరకు 66,215 మంది వెబ్ఆప్షన్లు ఎంచుకొన్నారు. ఈ ఏడాది కొత్తగా కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ కోర్సులను ప్రవేశపెట్టారు.