పరిగి/షాబాద్ : ఈ నెల 25 నుంచి నవంబర్ 3 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్కుమార్ సుల్తానియా, ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఉమర్ జలీల్తో కలిసి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణపై కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 25 నుంచి నవంబర్ 3 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలుంటాయని.. విద్యార్థులు 8.30లోపు పరీక్షా కేంద్రాలకు చేరేలా చూడాలని సూచించారు. పోస్టాఫీసు, టీఎస్ఆర్టీసీ, పోలీసు, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య శాఖ, విద్యా శాఖ వారి పరిధిలో నిర్వహించాల్సిన విధులను ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని పేర్కొన్నారు. విద్యార్థులు సమయానికి చేరుకునేలా ఆర్టీసీ సదుపాయాలు కల్పించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు శాఖ 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. విద్యార్థులు, అధ్యాపక బృందం, సిబ్బంది కొవిడ్ నిబంధనలు పాటించేలా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలన్నారు.
కేంద్రాలను శానిటైజ్ చేయాలని సూచించారు. మాస్కులు, శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్, ఫస్ట్ ఎయిడ్, అంబులెన్స్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. కరోనా అనంతరం మొదటిసారిగా పరీక్షల నిర్వహిస్తున్నందున కొవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సూచించారు. అన్ని కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. జ్వరం లక్షణాలున్నవారికి ప్రత్యేక గది కేటాయించాలని వైద్యాధికారులకు మంత్రి సూచించారు. పరీక్షా కేంద్రాల చుట్టూ ఉండే జిరాక్స్ సెంటర్లు పరీక్ష జరిగే సమయంలో మూసి ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఎలక్టానిక్ పరికరాలు తీసుకురాకుండా చూడాలని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్య లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలో 195 కేంద్రాలున్నాయని, పరీక్షలకు 56,241 మంది విద్యార్థులు హాజరువుతున్నారన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుంగా చర్యలు తీసుకుంటున్నామని, పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులతో సన్నాహక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి తగు ఆదేశాలిచ్చామని తెలిపారు. అన్ని కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసేలా అధికారులను ఆదేశించామన్నారు.
వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేశామని, 144 సెక్షన్ అమలుకు సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 29 పరీక్షా కేంద్రాలు ఉన్నాయని, 9,239 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ రషీద్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శంకర్నాయక్, వివిధ శాఖల అధికారులు, రంగారెడ్డి జిల్లా నుంచి ఇంటర్మీడియట్ బోర్డు అధికారి వెంక్యానాయక్, జిల్లా విద్యాశాఖాధికారి సుశీందర్రావు, వైద్య, విద్యుత్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.