ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి
గద్వాల, మార్చి 30: నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ ఆలయాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు ప్రసాద్ జములమ్మ ఆలయ ఆవరణలో అష్టాదశ శక్తి విగ్రహాలలో ఒక విగ్రహానికి దాతగా రూ.లక్షను ఎమ్మెల్యేకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జములమ్మ ఆలయఆవరణలో విగ్రహాల నిర్మాణం కోసం దాతలు సహకరించడం మంచి పరిణామమన్నారు. జములమ్మ ఆలయం దిన దినాభివృద్ధి చెందుతున్నదని, ఆలయానికి వచ్చే భక్తులకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత పాలక మండలిపై ఉన్నదన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సతీశ్కుమార్, గద్వాల ఎంపీపీ ప్రతాప్గౌడ్, జెడ్పీటీసీ రాజశేఖర్, కౌన్సిలర్ నాగిరెడ్డి, నాయకులు పరుమాల నాగరాజు, లత్తిపురం వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.
సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలి
రోగాల బారిన పడి చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేదవారికి ఆపన్న హస్తం అందించడానికి ప్రభుత్వం సీఎం సహాయనిధిని ఏర్పాటు చేసిందని దీనిని పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధరూర్ మండలం చింతరేవుల గ్రామానికి చెందిన వెంకటయ్య అనారోగ్యంతో బాధపడు తుండగా చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.34వేల చెక్కును ఎమ్మెల్యే బాధితుడి కుటుంబానికి అందజేశారు. అలాగే ధరూర్ మండలంలోని కొత్తపాలెం గ్రామానికి చెందిన సుభద్రకు మంజూరైన రూ.16 వేల సీఎం సహాయనిధి చెక్కును ఆమె భర్త సత్యన్నకు అందజేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కేటీఆర్ యువసేన ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దౌలత్, ప్రభాకర్గౌ డ్,వేణుగోపాల్ రావు, జాకీర్, తిరుపతిరెడ్డి, ఈశ్వర్, నారాయణ, గోపాల్, రాములు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన టీఎన్జీవో,పీజేపీ ఉద్యోగులు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణీదేవి గెలుపునకు ఎమ్మెల్యే చేసిన కృషిని అభినందిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డిని టీఎన్జీవో,పీజేపీ ఉద్యోగులు బోకే శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్సీ గెలుపులో ఉద్యోగ, ఉపాధ్యాయ, పట్టభద్రుల సహకారం మరువలేనిదన్నారు. అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రకటించిన పీఆర్సీ అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు ఆమోద యోగ్యంగా ఉందని చెప్పారు. సీఎంకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఎప్పుడూ రుణపడి ఉంటాయన్నారు. ఎమ్మెల్యేని కలిసిన వారిలో టీఎన్జీవో నాయకులు ఆనంద్, భీమన్న, వెంకటరాజారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రవివర్మ, సత్యనారాయణ, అర్పితా, విష్ణు, నాగార్జునరెడ్డి, భాస్కర్, పరశురాం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.