హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): అన్ని మతాలకు సమప్రాధాన్యం ఇస్తూ గౌరవిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కూడా రంజాన్వేళ ముస్లింలకు నజరానాలు అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని పేద ముస్లిం కుటుంబాలకు బట్టలు, ఇతర సామగ్రిని కానుకగా అందిస్తున్నది. ఆర్థిక వ్యవస్థను కరోనా చిన్నాభిన్నం చేసినా.. ఖజానాకు గండిపడినా సీఎం కేసీఆర్ మానవీయతను చాటుకొన్నారు.
815 మసీదుల పరిధిలో 5లక్షల కుటుంబాలకు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 815 మసీదుల పరిధిలోని దాదాపు ఐదు లక్షల కుటుంబాలకు కానుక అందిస్తున్నది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నజరానా ఇస్తున్నారు. గతేడాది కంటే ఈసారి మరో 50 వేల మందికి అదనంగా గిఫ్ట్ ప్యాక్లను పంపిణీ చేస్తున్నది. ఇందుకోసం రూ.33 కోట్లు విడుదల చేసింది.
మైనారిటీల సంక్షేమమే ధ్యేయం
మైనారిటీల సంక్షేమానికి తెలంగాణ సర్కార్ అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఇందుకోసం ఈ బడ్జెట్లో 1,606 కోట్లు కేటాయించింది. జామే నిజామియాలో రూ.15 కోట్లతో అత్యాధునిక ఆడిటోరియం, కోకాపేటలో 10 ఎకరాల్లో ఇస్లామిక్ కల్చరల్, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నది. మక్కా మసీదుకు రూ.19 కోట్లతో మరమ్మతు పనులు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 204 గురుకుల పాఠశాలలు, సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద ఇప్పటివరకు రూ. 294 కోట్లు ఖర్చుపెట్టి 1,684 మంది యువతకు విదేశీ విద్యకు అవకాశాలు కల్పించింది. ఐఏఎస్, ఐపీఎస్ శిక్షణ కోసం కోరుకున్నచోట శిక్షణ ఇప్పించి ముస్లిం యువతను సివిల్స్ సర్వీసువైపు ప్రోత్సహిస్తున్న సర్కార్ దేశంలో ఇదేనని మైనారిటీ పెద్దలు పేర్కొంటున్నారు.
ఆర్థిక ఇబ్బందులున్నా ఆత్మీయతను వీడని సీఎం కేసీఆర్
ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలపట్ల సీఎం కేసీఆర్ మానవీయతను వీడకుండా పరిపాలన అందిస్తున్నారు. రంజాన్ వేళ పేద ముస్లిం కుటుంబాలకు గిఫ్ట్ ప్యాక్ల పంపిణీ ఆపకూడదని నిధులు విడుదల చేశారు. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ, వాటి సంప్రదాయాలు, ఆచరాలకు నిలువెత్తు సాక్షీభూతంగా తెలంగాణ నిలుస్తున్నది.
-కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర షెడ్యూల్డ్కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ