హైకోర్టులో చెన్నమనేని రమేశ్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు
హైదరాబాద్, జూన్ 22, (నమస్తే తెలంగాణ): జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్నానని, ప్రస్తుతం తనకు భారతదేశ పౌరసత్వం మాత్రమే ఉన్నదని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. గతంలో జారీ అయిన జర్మన్ పాస్పోర్టుపై ప్రయాణించినంత మాత్రాన తనకు జర్మనీ పౌరసత్వం ఉన్నట్టు కాదన్నారు. ఆయన పౌరసత్వ వివాదంపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. చెన్నమనేని వివరణపై కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్రం గడువు కోరడంతో విచారణ రెండు వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ అభినంద్కుమార్ షావిలి ఉత్తర్వులు జారీ చేశారు. భారత పౌరసత్వ చట్టంలోని 5.1ఎఫ్ నిబంధనకు లోబడి, తాను జర్మనీ పౌరసత్వ చట్టం ఆర్టికల్ 17కు అనుగుణంగా ఆ దేశ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు చెన్నమనేని రమేశ్ అఫిడవిట్లో పేర్కొన్నారు. భారత పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 9.2లోని షెడ్యూల్ 3 చెల్లదని గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. జర్మనీ పౌరసత్వం వదులుకొన్నట్టుగా అధికారిక ధృవీకరణ పత్రాన్ని ఇదివరకే హైకోర్టుకు నివేదించినట్టు తెలిపారు. దీనిపై కౌంటర్ దాఖలుకు కేంద్రం రెండు వారాల సమయాన్ని కోరటంతో విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.