హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్నదని టీర్ఎస్కేవీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రాంబాబు యాదవ్ తెలిపారు. వాటిని నిర్దేశిత లబ్ధిదారులకు చేర్చడంలో అంగన్వాడీలు వారధిలా వ్యవహరించాలని సూచించారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీని వర్తింపచేసి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందని గుర్తుచేశారు. ప్రజా సంక్షేమ పథకాల అమలుకు అంగన్వాడీలు ఇతోధికంగా కృషి చేస్తున్నారని భారతి చెప్పారు. చిరుద్యోగులను ఎంతో గౌరవిస్తున్న సీఎం కేసీఆర్ తమకు ఉద్యోగ భద్రత, పెన్షన్ సదుపాయం, ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలను కల్పించాలని కోరారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ నారాయణ, కోశాధికారి మాచర్ల వేదవతి, సహాయ కార్యదర్శి మేకపోతుల కృష్ణకుమారి, నాయకులు నాగలక్ష్మి, దాడి అరుణ, సుజాత, ఎల్లమ్మ, వరలక్ష్మి, లీలావతి, రజిత, రంగు ఉమారాణి, నసీమా, వీ ఉమాదేవి, కోమల తదితరులు పాల్గొన్నారు.