వెంకటాపూర్, డిసెంబర్ 5: రామప్ప శిల్పకళ సౌందర్యం అబ్బురపరిచేలా ఉన్నదని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య అన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని ఆదివారం విదేశీ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శులు ఆంస్ట్రాంగ్ చాంగ్స్న్, అబ్బగాని రాము, డాక్టర్ సురభిసింగ్, ముఖ్య కార్యనిర్వాహక అధికారితో కలిసి సందర్శించారు. ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ వారికి ఫూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టూరిజం గైడ్ ఆలయ విశిష్ఠతను, శిల్పకళ ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా సంజయ్ భట్టాచార్య మాట్లాడుతూ.. రామప్ప గర్భగుడిలో సహజ కాంతి ఆశ్చర్యకరంగా ఉన్నదన్నారు. కాకతీయుల కాలం నాటి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, జీవనశైలిని నేటితరానికి అందించారని పేర్కొన్నారు.