వరంగల్ : యునెస్కో గుర్తింపు పొందిన చారిత్రక రామప్ప దేవాలయం మరింత అభివృద్ది చెందేందుకు ఆస్కారం ఉందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రపంచ పటంలో కాకతీయ రాజులు నిర్మించిన కట్టడానికి చోటు దక్కడం వల్ల మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నట్లయిందన్నారు. చారిత్రక రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు పొందడానికి ప్రభుత్వానికి సహాయ, సహకారాలు అందించిన కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు పాపారావు, ప్రొఫెసర్ ఎం. పాండురంగారావు, ఆర్కిటెక్చర్ సూర్యనారాయణ మూర్తిలను మంగళవారం వరంగల్ అర్బన్ జిల్లాలోని రాంపూర్లో మంత్రి కలిసి శాలువ కప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం వెనుక 11 సంవత్సరాలుగా పాపారావు, పాండురంగారావులు చేసిన కృషి ఎంతో ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం 2016లో నామినేషన్ ప్రచారాన్ని ప్రారంభించిందని ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీతో వ్యక్తిగతంగా మాట్లాడి కాకతీయ కట్టడం ప్రాధాన్యతను వివరిస్తూ అధికారికంగా లేఖ ఇవ్వండంలో కేంద్ర ప్రభుత్వం 2019 లో యునెస్కో లకు నామినేషన్ సమర్పించినట్లు ఆయన తెలిపారు. యునెస్కో అడిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆలయ ప్రత్యేకత ను పలుమార్లు తెలియజేస్తూ ప్రొఫెసర్ పాండురంగారావు, ఆర్కిటెక్చర్ సూర్యనారాయణ మూర్తి, చింతామణి గోపాల్ లాంటి నిపుణలతో నివేదికను పంపించిందన్నారు.
జూన్ 23వ తేదీన సహచర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ప్రొఫెసర్ పాండు రంగారావు, రాష్ట్ర స్థాయి అధికారులు ఢిల్లీ వెళ్లి అప్పటి కేంద్ర పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ మంత్రిని, అర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులను, ఇతర అధికారులను కలిసి వారసత్వ గుర్తింపు కోసం కేంద్రం నుంచి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.
యునెస్కో గుర్తింపు వల్ల రామప్ప ఆలయం ప్రపంచ పర్యాటక ప్రాంతం అవుతుందని, ఇందుకు తగ్గట్టుగానే మెరుగైన సేవలు యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని అయన తెలిపారు. మన రామప్పకు ఈ ఘనకీర్తి లభించడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేసారని ఆయన అన్నారు. రామప్ప ఆలయానికి గుర్తింపు ఒక మైలు రాయి మాత్రమే. ఇది ముగింపు కాదు. వచ్చే దశాబ్దంలో ఇతర కాకతీయ కట్టడాల అభివృద్ధి కోసం పని చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.